40 ఏళ్ల బాబుతో 4 ఏళ్ల పార్టీ ‘మైండ్గేమ్’!? జనసేన పాచిక పారుతుందా?
అమరావతి: ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయి కాలం పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడి ముందు.. జస్ట్ నాలుగేళ్ల కిందట ఆవిర్భవించిన జనసేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
టచ్లో ఉన్నారంటూ అధికార పార్టీకే ఝలక్...
సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పుడు ఏపీలో అతిపెద్ద పార్టీ, అధికార పార్టీ అయిన టీడీపీకే ఝలక్ ఇస్తోంది. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారంటూ ఇటీవల ఓ లీక్ ఇచ్చి సంచలనం సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే స్వయంగా ఈ విషయాన్ని చెబితే, ఇప్పుడు జనసేన పార్టీ ప్రతినిధులు కూడా.. ఔను, 40 మంది ఎమ్మెల్యేలు మాకు ‘టచ్' లో ఉన్నారని చెబుతున్నారు. అయితే.. వాళ్లెవరు? అంటే మాత్రం వారు సూటిగా స్పందించడం లేదు.
ఎవరా 40 మంది.. ఇప్పుడిదే యక్షప్రశ్న...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవర్నది ఇప్పుడు యక్షప్రశ్నగా మారింది. జనసేన ప్రతినిధులు ఈ విషయంలో స్పష్టతనివ్వడం లేదు. ‘వాళ్లెవరో మాకు తెలుసు, వాళ్లకు తెలుసు, ఆ ఎమ్మెల్యేల పిల్లలకూ తెలుసు..' అంటూ డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు వంద. వారిలో నలభై మంది తమతో టచ్ లో ఉన్నారని జనసేన ప్రకటించడం తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపుతోంది.
మైండ్ గేమ్ ఆడుతున్నరా?
టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే అంశంపై జనసేన ప్రతినిధులు నిజమే చెప్పారా? లేక అబద్ధం చెప్పారా? అనే విషయంలో స్పష్టత లేదు. లేదంటే కేవలం ఈ ప్రకటనతో.. వాళ్లు తెలుగుదేశం పార్టీపై ఒక మైండ్ గేమ్ను మొదలు పెట్టారా? పోనీ, నలభై మంది టచ్ లో లేకపోయినా.. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా టచ్ లో ఉన్నారేమో? అనే విశ్లేషణలకు అవకాశం ఇస్తోంది జనసేన చేసిన ప్రకటన.
ప్రజారాజ్యం పెట్టినప్పుడేం జరిగింది?
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు.. తెలుగుదేశం నుంచి అనేక మంది నేతలు ఆ పార్టీలోకి జంప్ చేశారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దీంతో సులువుగా టీడీపీకి రాజీనామా చేసి.. చాలా మంది నేతలు ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఈ లీకుల ప్రభావం టీడీపీపై ఎలా ఉంటుందో చూడాలి మరి!