ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 402 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు
తాజాగా నమోదైన 402 కరోనా కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,79,339కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 7082 మంది కరోనాతో మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడపలో ఒక్కొక్కరు మరణించారు.
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు
గత 24 గంటల వ్వవధిలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 19, చిత్తూరులో 86, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 32, కడపలో 25, కృష్ణాలో 72, కర్నూలులో 5, నెల్లూరులో 16, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 35, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 34 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో 4వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో 412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,68,279కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3978 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,13,57,530 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో 3 లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
ఇక దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం 20వేల కంటే తక్కువగానే నమోదయ్యాయి. గత 24గంటల్లో 19,556 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. గడిచిన 24 గంటల్లో 301 కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,46,111కు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసల సంఖ్య 2,92,518కి చేరింది.