కోనసీమ అల్లర్లలో 46 మంది అరెస్ట్, పరిస్థితులు అదుపులోనే: హోంమంత్రి తానేటి వనిత
అమరావతి: ప్రస్తుతం కోనసీమ, అమలాపురంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత, అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి వనిత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళనలు జరగకుండా అమలాపురానికి అదనపు బలగాలను పంపామని, అక్కడి పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉన్నాయని తెలిపారు.
గతంలో ఏడుకుపైగా కేసులున్న 72 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 46 మందిని అరెస్ట్ చేశామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లపై దాడి చేసినవారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. సంయమనం పాటించారని పోలీసులను హోంమంత్రి వనిత అభినందించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది ఇలావుండగా, అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకుగాను ఉన్నతాధికారులు, పోలీసుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుందని ప్రకటించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని అధికారులు తెలిపారు.
మరోవైపు, ఆందోళనల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు వీడియో పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ల ఆధారంగా ఆందోళన కారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా ఎయిల్ టెల్ తన సర్వీసులు నిలిపివేసింది. కోనసీమలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఆందోళనకారులు మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు.