మొన్న కుప్పం: ఈ సారి పులివెందుల: చివరి విడత పోలింగ్: క్లీన్ స్వీప్పై వైసీపీ..టఫ్ ఫైట్ టీడీపీ
అమరావతి: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తెల్లవారు జామున 6:3 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఓటింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలి గంటలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చివరి గంటను కేటాయించారు.
13 జిల్లాల్లో 16 రెవెన్యూ డివిజన్లలో పరిధిలోని 161 మండలాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుమారుగా 67,75,226 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాలుగో విడతలో 3,299 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, వాటిలో 554 ఏకగ్రీవం అయ్యాయి. ఫలితంగా- ఏకగ్రీవాలు పోను మిగిలిన 2,743 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 7,425 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 33,435 వార్డు స్థానాలకు గాను 10,921 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాలకు ఓటింగ్ చేపట్టారు.
ఇవి చివరి విడత ఎన్నికల పోలింగ్. ఇదివరకు మూడు దశల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 9, 13, 17 తేదీల్లో పోలింగ్ కొనసాగింది. ఈ మూడు విడతల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఈ మూడు దశల్లోనూ 80కి పైగా ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి, తాము ధీటుగా ప్రతిఘటించామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ కంటే అధిక పంచాయతీలను కైవసం చేసుకున్నామని స్పష్టం చేస్తోంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం.. కుప్పంలో మెజారిటీ పంచాయతీలను వైసీపీ గెలుచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 89 పంచాయతీల్లో వైసీపీ-74, టీడీపీ-14 చోట్ల వియం సాధించాయి. ఈ విడతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది.
ఫలితంగా అందరి దృష్టీ ఫలితాలపైనే నిలిచింది. ఈ సారి కూడా తమను ప్రజలు ఆదరిస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపిస్తాయని అంటున్నారు. ఈ సారి కూడా గట్టిపోటీ ఇస్తామని టీడీపీ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.