సీబీఐ కేసులు నమోదైన ఎమ్మెల్యేలు-ఎంపీల్లో ఏపీ వాళ్లే టాప్..!!
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ, రాజ్యసభ సమావేశం అయ్యాయి. ఉప రాష్ట్రపతిగా కొత్తగా ఎన్నికైన జగ్దీప్ ధన్కర్ రాజ్యసభ ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్గా ఇదే ఆయనకు తొలిరోజు. మొత్తం 17 రోజుల పాటు ఉభయసభలు సమావేశం కానున్నాయి. మొత్తంగా 16 బిల్లులు ఆమోదం కోసం సభ సమక్షానికి రానున్నాయి.
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు- ముగిసిన విచారణ: తీర్పు..!!
మహిళల రిజర్వేషన్, జనాభా నియంత్రణ, పాత పింఛన్ విధానానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ- ఈ సమావేశాలకు గైర్హాజర్ కానున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రను కొనసాగిస్తోన్నారు. ఈ కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు కాలేకపోవచ్చు. చైనాతో సరిహద్దు వివాదం, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ సర్వర్లపై సైబర్ అటాక్.. వంటి పలు కీలక అంశాలు సభలో చర్చకు రానున్నాయి.
తొలుత ఈ మధ్యకాలంలో కన్నుమూసిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించింది. గతంలో కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్సభ నుంచి విజయం సాధించిన సూపర్ స్టార్ కృష్ణకు సభ్యులు నివాళి అర్పించారు. ములాయం సింగ్ యాదవ్ సహా మొత్తం ఎనిమిది మందికి ఈ మధ్యకాలంలో కన్నుమూశారు. నివాళి అర్పించిన అనంతరం సభ మధ్యాహ్నం 12, ఆ తరువాత 2 గంటలకు సభ వాయిదా పడింది.
రెండోసారి సభ సమావేశమైన తరువాత సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు అధికార పార్టీ లిఖిపూరకంగా సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా సీబీఐ కేసులను ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను కూడా వెల్లడించింది. దేశం మొత్తం మీద 56 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై సీబీఐ కేసులు నమోదయ్యాయని, 22 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. రాష్ట్రాలవారీగా వివరాలను వెల్లడించారు.
ఇందులో అత్యధికంగా ఉన్న సంఖ్య ఆంధ్రప్రదేశ్దే. ఏపీ చెందిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సీబీఐ కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో కేరళ, ఉత్తర ప్రదేశ్ నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరుమంది చొప్పున ఎమ్మెల్యేలు, ఎంపీలపై సీబీఐ కేసులు పెట్టింది. హర్యానా-1, కర్ణాటక-2, తమిళనాడు-4, ఛత్తీస్గఢ్-1, పశ్చిమ బెంగాల్-5, ఢిల్లీ-3, బిహార్-3, మేఘాలయ-1, మణిపూర్-3, ఉత్తరాఖండ్-1, అరుణాచల్ ప్రదేశ్-5, జమ్మూ కాశ్మీర్-2, మధ్యప్రదేశ్-1, మహారాష్ట్ర-1, లక్షద్వీప్-1 ఉన్నాయి.