ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 3 జిల్లాల్లో ‘సున్నా’, యాక్టివ్ కేసుల్లో క్షీణత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసులు 100 లోపే ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసుల కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది.
ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,717 కరోనా నమూనాలను పరీక్షించగా.. 56 మందికి కరోనా సోకినట్లు తేలిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,87,066కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7149కి చేరింది.
ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు
ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో 6, తూర్పుగోదావరిలో 9, గుంటూరులో 7, కడపలో 2, కృష్ణాలో 11, కర్నూలులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల్లో క్షీణత
తాజాగా, 141 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,78,528కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1389 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,29,03,830 కరోనా పరీక్షలను నిర్వహించారు.
దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 5,70,246 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13,203 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. గత 24 గంటల్లో 131 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,53,470కి చేరింది. నిన్న ఒక్కరోజే 13,298 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,03,30,084కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,84,182 యాక్టివ్ కేసులున్నాయి.