గంటలుగా డ్రైనేజీలో ఆరేళ్ల అతిథి: అనుమానాస్పద స్థితిలో అమల మృతి
విశాఖపట్నం: విశాఖపట్నంలో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. డ్రైనేజీలో పడిన ఆరేళ్ల బాలిక అతిథి కోసం గత 20 గంటలకు పైగా సహాయక బృందాలు గాలింపు చర్యలు సాగిస్తున్నాయి. విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో ట్యూషన్కు వెళ్తూ అతిథి డ్రైనేజీలో పడిపోయింది. ఆమె ఆచూకీ గంటల తరబడి గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
సహాయక సిబ్బంది డ్రైనేజీలో చెత్తను తొలగిస్తున్నారు. కిలోమీటర్ల కొద్దీ డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. మ్యాన్ హోల్స్ను కూడా గాలిస్తున్నారు. అశీల్ మెట్, బీచ్ రోడ్, మున్సిపల్ ఆఫీసుల వద్ద అతిథి కోసం గాలింపు జరుపుతున్నారు.
ఇదిలావుంటే, డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని అమల అనుమానాస్పద స్థితిలో మరణించింది. విశాఖపట్నలోని కెజిహెచ్లో చికిత్స పొందుతూ ఆమె మృత్యువు ఒడిలోకి జారిపోయింది. ఈ నెల 19వ తేదీన కాలేజీకి వెళ్లిన అమల సాయంత్రం కెజిహెచ్లో చేరింది.
తన మిత్రులతో కలిసి అమల అనంతగిరి వెళ్లిందని, అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కూతురు అనంతగిరి ఎందుకు వెళ్లిందనేది తెలియక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వారు బోరున విలపిస్తున్నారు. అమలతో పాటు అనంతగిరి వెళ్లిన మిత్రులు ఎవరనేది తెలియడం లేదు. దీంతో అమల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కర్నూలులోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. అతను కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చదువు విషయంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగానే శ్రీకాంత్ ఆత్మహత్యయతానికి ప్రయత్నించాడని అంటున్నారు. నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.