ఏపీకి ఏదో రూపంలో: ఏచూరి, 60 శాతం వచ్చాయ్: కామినేని, బాబుని ఎండగట్టనున్న వైసిపి
విశాఖ/హైదరాబాద్: భవిష్యత్తు దృష్ట్యా ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాలని సీతారాం ఏచూరీ మంగళవారం అన్నారు. విభజన నేపథ్యంలో గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఎన్డీయే కొనసాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు. బీహార్కు ప్రధాని నరేంద్ర మోడీ భారీ ప్యాకేజీ ప్రకటన కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు.
60 శాతం నిధులు విడుదల చేసింది: కామినేని
ప్రత్యేక హోదా అంశాన్ని సెంటిమెంట్ అంశంగా చూడాల్సిన అవసరం లేదని మంత్రి కామినేని శ్రీనివాస రావు మంగళవారం విశాఖలో అన్నారు. కేంద్రం ఏపీ అభివృద్ధి కోసం 60 శాతం నిధులను విడుదల చేసిందని చెప్పారు.
మంత్రి కామినేని విశాఖలో ఫార్మా కంపెనీ యాజమాన్యాలతో భేటీ అయ్యారు. కాలుష్య నివారణ, ఫార్మా రంగ సమస్యలపై చర్చించారు. ఫార్మా రంగ సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఫార్మా పరిశ్రమ విస్తరణ, పెట్టుబపడులకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ఎండగట్టాలని వైసిపి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ఎండగట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లోటస్ పాండులో వైసీపీ పరిశీలకులు సమావేశమయ్యారు. ఈ నెల 29న బందును విజయవంతం చేయాలని వారు కోరారు. ఇందుకోసం ఉద్యోగులు, రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు.