ఏపీ ప్రయాణికులకు గుడ్న్యూస్: సంక్రాంతి పండక్కి 6400 ప్రత్యేక బస్సులు
అమరావతి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ 4వేలకుపైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించగా.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) కూడా ప్రయాణికులకు మంచివార్త అందించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం 6400 ప్రత్యేక బస్సులు నడపున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సంక్రాంతికి ఏపీఆర్టీసీ బస్సులు: ఇలా చేస్తే 10శాతం రాయితీ
విజయవాడలో ఆర్డీసీ ఎండీ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా ఉందని చెప్పారు. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామన్నారు. 62 స్టార్లైనర్ నాన్ ఏసీ-స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టామని చెప్పారు.
ఏపీఆర్టీసీ ప్రవేటీకరణ లేదు.. ఉద్యోగులకు అలవెన్సులు
వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ. 165 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అన్ని బస్సుల్లో డిసెంబర్ నెలాఖరు వరకు టిమ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే యోచన లేదని స్పష్టం చేశారు. పొరుగు సేవల ఉద్యోగులను కూడా తొలగించడం లేదన్నారు. ఉద్యోగులకు ఓటీలు, అలవెన్సులు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. వివరాలను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. అలవెన్సులపై ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని ప్రతిరోజూ ప్రభుత్వానికి చెల్లించే ప్రతిపాదన లేదని తెలిపారు.
ఆర్టీసీ స్థలం వైసీపీ కార్యాలయానికి కేటాయింపుపై ఎండీ ఇలా
ఆర్టీసీకి చెందిన స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ స్థలాన్ని తమ సంస్థకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిందని తెలిపారు. సంస్థ ఆస్తులు కాపాడుకునే బాధ్యత తమపై ఉందని, ప్రభుత్వంపైనా ఉందని తెలిపారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. స్థలం కేటాయింపు విషయం తెలిసి నిరసన తెలిపామన్నారు.