కరోనా నుంచి కోలుకుంటోన్న ఏపీ: కేసులు పెరుగుతున్నా: 321 మంది డిశ్చార్జి: నాలుగు రోజులుగా నో డెత్స్..!
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లు, ఐసొలేషన్ వార్డుల నుంచి పెద్ద ఎత్తున కరోనా వైరస్ పేషెంట్లు డిశ్చార్జి అవుతున్నారు. ఒకవంక రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అదే స్థాయిలో పేషెంట్లు డిశ్చార్జి అవుతుండటం ఊరట కలిగించే అంశమని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 71 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. ఈ సారి అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయి. గత మూడు రోజులుగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని భావించినప్పటికీ ఒకేసారి 43 పాజిటివ్స్ వెలుగులోకి రావడం అధికారులను ఆందోళనలోకి నెట్టింది. అదే జిల్లాలో మరో 43 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయట పడి, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కావటం పట్ల ఒకింత ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఈ సంఖ్య నాలుగు లోపే ఉంది. గుంటూరు, కడప జిల్లాల్లో నాలుగు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరులో రెండు కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. మొత్తంగా అనంతపురం-61, చిత్తూరు-80, తూర్పు గోదావరి-42, గుంటూరు-287, కడప-73, కృష్ణా-246, కర్నూలు-386, నెల్లూరు-84, ప్రకాశం-60, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-23, పశ్చిమ గోదావరి-56 కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం కరోనా ఫ్రీ జిల్లాగా ఉంది.
నేడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీ విరమణ.. వాట్ నెక్స్ట్? ఐవైఆర్ బాటలోనా.. లేక..!
మొత్తంగా నమోదైన 1403 పాజిటివ్ కేసుల్లో యాక్టివ్గా ఉన్నవి 1051. ఇప్పటిదాకా 321 మంది కరోనా నుంచి కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని, 31 మంది మరణించారని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తాజా బులెటిన్లో వెల్లడించారు. నాలుగు రోజులుగా కరోనా వల్ల ఏ ఒక్కరు కూడా మరణించలేదని అన్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 87 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతపురం-20, చిత్తూరు-16, తూర్పు గోదావరి-14, కడప-28, కృష్ణా-32, కర్నూలు-43, నెల్లూరు-27, ప్రకాశం-23, విశాఖపట్నం-20 మంది కోలుకున్న వారిలో ఉన్నారు.