జగన్ ఫొటోతో 77 లక్షల సర్వే రాళ్లు-తీయాలంటే 15 కోట్లు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర భూసర్వేలో భాగంగా పెట్టిన సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ముద్రించారు. ఇలా రాష్ట్రంలో 77 లక్షల సర్వే రాళ్లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇవాళ సీఎం చంద్రబాబు నిర్వహించిన రెవెన్యూ, రిజిస్ట్రేషనన్ల శాఖ సమీక్షలో అధికారులు ఆయనకు ఈ వివరాలు అందజేశారు. అయితే వీటిని తొలగించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి కారణం వాటికి అయ్యే భారీ ఖర్చే.
కేంద్రం గతంలో చెప్పిన భూముల సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారని అధికారులు తెలిపారు. మాజీ సీఎం బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలిక అంచనా వేశారు. కాబట్టి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని అధికారులు ఇవాళ సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయాలో చూడమని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో అధికారులు కూడా తలపట్టుకుంటున్నారు. జగన్ ఫొటోతో ఉన్న రాళ్లను ఇతర అవసరాలకు వాడలేక, అలాగని 15 కోట్లు పెట్టి ఈ ఫొటోలు తొలగించలేక ఏం చేయాలన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications