ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు: వారాల తర్వాత యాక్టివ్ కేసుల్లో పెరుగుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 26,526 నమూనాలను పరీక్షించగా.. 79 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,156కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఒక్క రోజు వ్యవధిలో విశాఖపట్నం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించినవారి సంఖ్య 7167కు చేరింది. గత 24గంటల్లో 77 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,81,369కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 620 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,70,612 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 11, చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 6, కడపలో 4, కృష్ణాలో 7, కర్నూలులో 3, నెల్లూరులో 12, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 5, పశ్చిమగోదావరిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,193 కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,09,63,394కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,06,67,741కు చేరింది. గడిచిన 24 గంటల్లో 97 మంది మరణించగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,56,111కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,39,542 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.