ఐ లవ్ యూ చెప్పలేదని బాలికపై హత్యాయత్నం
చిత్తూరు: చిత్తూరు జిల్లా జిల్లాలో అత్యంత దారుణమైన అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. పిల్లల్లోకి కూడా ప్రేమ వ్యవహారం చొచ్చుకుపోయి అవాంఛనీయమైన సంస్కృతికి దారి తీస్తోంది. ఐ లవ్ యూ చెప్పలేదని ఓ ఎనిమిదేళ్ల వయస్సు గల బాలుడు మూడేళ్ల బాలికపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు.
ఆ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారంనాడు చోటు చేసుకుంది. స్థానిక కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక తనకు ఐ లవ్ యూ చెప్పలేదని పక్కనే నివాసం ఉంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆగ్రహించాడు.
మూడో తరగతి చదవుతున్న ఆ బాలుడు ఆ బాలికను ఇంటి సమీపంలోనికి తీసుకుని వెళ్లి ఐ లవ్ యూ చెప్పాలని వేధించాడు. మొండికేసిన బాలిక అందుకు నిరాకరించింది. దాంతో అతను ఆ బాలిక గొంతుకు తాడుతో ఉరేసి చంపే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలో బాలిక కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందిచారు. మదనపల్లె టూటౌన్ పోలీసులు ఆ బాలుడిని పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.