ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 80వేలకు పైగా, 49 మరణాలు, జిల్లాల వారీగా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 8147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
80వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా నమోదైన 8147 కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1029 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 933కి చేరింది.
జిల్లాల వారీగా మరణాలు..
తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, పశ్చిమగోదావరిలో 5, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 3, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,41,993 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటి వరకు 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరో 39,990 మంది వివిధ కరోనా ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తాజా కేసుల్లో జిల్లాలో వారీగా గమనిస్తే.. అనంతపురం 984, చిత్తూరు 630, తూర్పుగోదావరి 1029, గుంటూరు 703, కడప 494, కృష్ణా 359, కర్నూలు 914, నెల్లూరు 278, ప్రకాశం 355, శ్రీకాకుళం 374, విశాఖపట్నం 898, విజయనగరం 322, పశ్చిమగోదావరి 807 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశ వ్యాప్తంగా 13 లక్షల కేసులు
దేశంలో ఇప్పటి వరకు 13,13,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,49,530 యాక్టివ్ కేసులున్నాయి. 8,32,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 30,941 మంది కరోనాబారినపడి మరణించారు.