వైజాగ్ జైలు నుంచి జనసేన నేతల రిలీజ్-హైకోర్టు బెయిల్ తో విడుదల-ఘనస్వాగతం
విశాఖలో వైసీపీ నిర్వహించిన వికేంద్రీకరణ గర్జన అనంతరం తిరిగి వెళ్తున్న మంత్రులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయిన జనసేన నేతలు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ కేసులో మొత్తం 9 మంది జనసేన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి స్ధానిక కోర్టు బెయిల్ ఇవ్వకుండా కస్టడీకి పంపింది. అయితే హైకోర్టు ఆదేశాలతో వారు బెయిల్ పై విడుదలయ్యారు.
విశాఖలో మంత్రులపై దాడి ఘటనలో పాత్ర ఉందన్న కారణంతో జనసేన పార్టీకి చెందిన ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పాటు మరో ఆరుగురు నేతలు అరెస్టయ్యారు. వీరు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న వీరు ఇవాళ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల మేరకు విడుదల అయ్యారు. దీంతో వీరి కోసం అక్కడే వేచి ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార పార్టీ కక్ష్య పూరితంగా వ్యవహరించిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఆరోపించారు. అక్రమంగా కేసులు పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ఇవాళ జైలు నుంచి విడుదలైన శివశంకర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పిరికి పందలా వ్యవహరిస్తోందని శివశంకర్ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే తెలియదని, దీంతో రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారులు పాలకులకు కుక్కల్లా పని చేస్తున్నారన్నారు. సెక్షన్ 30అమల్లో ఉండగా వైసీపీ విశాఖ గర్జనకు ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు