ఏపీలో కరోనా ఉధృతి: 9 లక్షలు దాటిన కరోనా కేసులు, మూడు జిల్లాల్లో సెంచరీ దాటాయి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 30,851 నమూనాలను పరీక్షించగా.. 993 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,00,805కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో భారీగా పెరిగిన కొత్త కేసులు, యాక్టివ్ కేసులూ..
గత 24 గంటల్లో కరోనా బారినపడి విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7,213 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 480 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,86,978కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,614 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,50,52,978 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 49, చిత్తూరులో 179, తూర్పుగోదావరిలో 29, గుంటూరులో 198, కడపలో 18, కృష్ణాలో 176, కర్నూలులో 37, నెల్లూరులో 35, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 45, విశాఖపట్నంలో 169,
విజయనగరంలో 16, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
తిరుమల సమాచారం.. కరోనా ఆంక్షలు
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి మార్చి 31 నుంచి 15వేల టైంస్లాట్ టోకెన్లు మాత్రమే ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం నుంచి అన్ని రకాల దర్శనాలకు 45వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే తిరుమలకు రావొద్దని ఆయన సూచించారు. కరోనా కేసులు మరింత తీవ్రమైతే శీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేసి వాటిని మే, జూన్కు రీషెడ్యూల్ చేస్తామన్నారు.