ఒకేరోజు రెండు హైఓల్టేజీ షాకులు: తేరుకోలేకపోతున్న వైసీపీ క్యాడర్
Recommended Video
అమరావతి: ఒకే రోజు..అదీ విజయదశమి పండగ వేళ.. బ్యాక్ అండ్ బ్యాక్ గా చోటు చేసుకున్న రెండు సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్యాడర్ కు హై ఓల్టేజీ షాక్ ఇచ్చాయి. దీని నుంచి తేరుకోలేకపోతోందా వింగ్. అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోవట్లేదంటూ పార్టీ అగ్ర నాయకత్వంపై చిరాకును ప్రదర్శిస్తోన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్యాడర్.. తాజాగా మంగళవారం చోటు చేసుకున్న రెండు ఉదంతాలతో మరింత అసహనానికి గురవుతోంది. ఒకటి- జూపూడి ప్రభాకర్ సొంత గూటికి చేరుకోవడం, రెండు- ఆటోల వెనుక థ్యాంక్యూ అనే స్టిక్కర్లను అతికిస్తోన్న వీడియో వెలుగులోకి రావడం. ఈ రెండు ఉదంతాలపై వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ ను దిగ్భ్రాంతికి గురి చేశాయని అంటున్నారు.
జూపూడి ప్రభాకర్ చేరిక ఊహించలేదట..
తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ పార్టీలో చేరడానికి కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారనే విషయం తెలిసినప్పటికీ.. దాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తీరా- పండగ వేళ ఆయన పార్టీ కండువాను కప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెబుతున్నారు. నిజానికి- జూపూడి ప్రభాకర్ వైసీపీ నాయకుడే. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆయన పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం తీర్థాన్ని పుచ్చుకున్నారు. దళిత నాయకుడు కావడం వల్ల ఆయనకు టీడీపీలో మంచి ప్రాధాన్యతే లభించింది. టీడీపీ ఆయనను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. ఈ క్రమంలో- వైసీపీపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అన్ని విమర్శలు చేసి.. మళ్లీ సొంతగూటికే
తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులూ వైఎస్ జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు జూపూడి. టీవీ డిబేట్లలో నిప్పులు చెరిగారు. పాదయాత్రల ద్వారా ముఖ్యమంత్రులు కాలేరంటూ వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రపై సెటైర్లు వేశారు. జూపూడి చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వచ్చింది వైసీపీ సోషల్ మీడియా క్యాడర్. చాలాసార్లు ఆయనపై కౌంటర్ అటాక్ చేసింది. ఎన్నికలు ముగియడం, పార్టీ అధికారంలోకి రావడం.. నాలుగు నెలల వ్యవధిలోనే జూపూడి పార్టీ కండువాను కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి.
బహిరంగ క్షమాపణ చెప్పించాల్సిందే..
గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లు, వైఎస్సార్ వాహనమిత్ర వంటి పథకాల అమలు జోష్ లో ఉన్న సోషల్ మీడియా క్యాడర్ కు జూపూడి చేరిక జీర్ణం కావట్లేదని చెబుతున్నారు. జూపూడి చేరికను నిరసిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జూపూడి.. వైఎస్ జగన్ పై చేసిన ఘాటు విమర్శలకు కౌంటర్ ఇస్తూ వచ్చామని, అలాంటి వ్యక్తి పార్టీ కండువా కప్పుకోవడాన్ని చూల్లేకపోతున్నామని అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరనే విషయం తెలిసినా గానీ జూపూడి టీవీ డిబేట్లలో తమ నాయకుడిపై చేసిన విమర్శలు గుర్తుకు వస్తున్నాయని వాపోతున్నారు. జూపూడితో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
జూపూడి ఉదంతానికి తోడు
జూపూడి చేరికకు తోడు.. ఆటోల వెనుక థ్యాంక్యూ సీఎం అనే స్టిక్కర్లను అతికిస్తోన్న ఉదంతం చోటు చేసుకోవడం, దానిపై విమర్శలు రావడం వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ కు మరింత ఇరకాటంలోకి నెట్టినట్టయింది. ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన ప్రచార కార్యక్రమాలను వైఎస్ జగన్ కూడా అనుసరించినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ఆటోలకు స్టిక్కర్లు అతికిస్తూ వీడియోలో కనిపించిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారిని ఈ చర్యకు ప్రోత్సహించిన నాయకులపై వేటు వేయాలని పట్టుబడుతున్నారు.