బండి భగీరథ్ పోక్సో కేసు: సీపీ సజ్జనార్ ఆదేశాలతో మరో కొత్త సిట్ ఏర్పాటు!
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేస్తుంది. ఇక తాజాగా మరో సిట్ ను సైతం ఈ కేసులో ఏర్పాటు చేయటం కేసు తీవ్రతను స్పష్టం చేస్తుంది.
జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో మరో సిట్
ఈ కేసులో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అవాస్తవ ప్రచారాలు, కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని పెడుతున్న అనుచిత పోస్టులపై దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు మరొక కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటయింది. జాయింట్ సీపీ శ్వేత ఈ నూతన సిట్ కు లీడ్ గా వ్యవహరిస్తూ కేసును లోతుగా విచారించనున్నారు.

సోషల్ మీడియా పోస్టులపై సీఎం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం
బండి భగీరథ్ కేసుకు సంబంధించిన అనేక కీలక ఆడియోలు, వీడియోలు, సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మైనర్ అయిన బాధితురాలి వ్యక్తిగత వివరాలతో పాటు ఆమె ఫోటోలను కూడా కొందరు బహిర్గతం చేశారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
బెయిల్ ఇస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి అంటూ ప్రచారం
దీంతో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో సిట్ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించగా, ప్రధాన నిందితుడు బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు.కేసు విచారణ సాగుతుండగానే, హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి సోషల్ మీడియాలో తీవ్రమైన దుష్ప్రచారం మొదలైంది. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, సదరు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కుతుందంటూ కొందరు అసత్య ప్రచారం చేశారు.
న్యాయమూర్తిపై అనుచిత పోస్టులు.. నెల్లూరు వ్యక్తి అరెస్ట్
న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరిచేలా సాగిన ఈ చర్యపై హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దీనిని సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు.న్యాయమూర్తిపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పోస్టులపై లోతైన దర్యాప్తుకు సిట్
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను, టెక్నికల్ ఆధారాల ద్వారా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలోని కొత్త సిట్ ఈ సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న మూలాలను, కుట్ర కోణాలను ఛేదించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.













Click it and Unblock the Notifications