సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు: మాచర్ల ఎమ్మెల్యే బంధువు కుటుంబం గల్లంతు
అమరావతి: గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రయాణికుస్తున్న కారు.. దుర్గి మండలం అడిగొప్పుల వద్దకు రాగానే అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్మోహన్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, కారులో ఉన్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును గజ ఈతగాళ్లతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెతికిస్తున్నారు. కుడి కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. రాత్రి కావడం అంతా చీకటిగా ఉండటం గాలింపు చర్యలకు కొంత ఆటంకంగా మారింది.
మునేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునేరులో ఈతకు దిగిన ఐదురుగు విద్యార్థులు గల్లంతై విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన చందర్లపాడు మండలం, ఏటూరులో చోటు చేసుకుంది. వీరి వయస్సు పట్టుమని 14 ఏళ్లు కూడా లేవు. కూలి నాలి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రుల రోదనలు కలిచివేస్తున్నాయి. ఆడుతూ పాడుతూ.. అందరితో చలాకీగా ఉండే ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.
సంక్రాంతి సెలవులు వచ్చాయన్న సంతోషంతో మునేరులో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులను మృత్యువు కబలించింది. గల్లంతైన పిల్లలు విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, ఏటూరులో చోటుచేసుకుంది. జెడ్పీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి గురజాల చరణ్ ( 14), ఏడో తరగతి చదువుతున్న జెట్టి అజయ్ (12) , కర్ల బాలయేసు (12), మాగులూరి సన్నీ ( 12), ఆరో తరగతి చదువుతున్న మైలా రాకేష్ ( 11) సోమవారం వారం మునేరులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంగళవారం ఉదయం ఆ ఐదుగురి మృతదేహాలను గుర్తించి మునేరు నుంచి వెలికితీశారు. దీంతో ఒక్క సారిగా ఏటూరు గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈతకు వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూలి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రుల రోదనలు కలిచివేస్తున్నాయి. ఒకే గ్రామంలో ఐదుగురు చిన్నారులు చనిపోవడంతో విషాదచాయలు అలముకున్నాయి.