ఏబీఎన్ ఆర్కేపై కేసు-స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విచారణ : ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ..!!
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేసారు. హైదరాబాద్తో పాటు పూణే, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరిన్ని కీలక ఆధారాలను సేకరించడం కోసం సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది.

సీఐడీ విచారణ వేగవంతం
రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు.

ఆంధ్రజ్యోతి ఎండీపై కేసు
సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులపైనా కేసు నమోదైంది. ఇక, సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 'రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు.. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకున్నారు. వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు
దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. అయితే, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేయటం పైన ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. లక్ష్మీనారాయణ నివాసానికి సీఐడి అధికారులు వెళ్లిన సమయంలో రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుటుంబంతో పాటు సీఐడీ అధికారులతోనూ ఆర్కే మాట్లాడారు. సీఐడీ విచారణకు సహకరించమని లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆర్కే చెప్పారు. రాధాకృష్ణ వెళ్లిన తర్వాత సీఐడీకి లక్ష్మీనారాయణ కుటుంబం సహకరించింది.
Recommended Video

ఇబ్బంది పెట్టేందుకే కేసు అంటూ..
మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి సర్దుమనిగిందని, ఇంకా కొంత సమయం ఉండమని రాధాకృష్ణను సీఐడీ అధికారులు కోరారు. ఇది వాస్తవం. అక్కడ జరిగిందంతా కూడా ప్రత్యక్ష ప్రసారాల్లో చూశాం. గతంలో నుంచే ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కక్ష ఉంది. ఏదోరకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ జీరోఎఫ్ఐఆర్ నమోదు చేయటం పైన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేంటి.. 36 గంటల తర్వాత మళ్లీ ఇలా కేసు నమోద చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications