అమ్మపై ఓ కూతురి ప్రేమ.. మరణించిన తల్లిని తండ్రి వద్దకు చేర్చి; నాన్నకు ఊహించని కానుక !!
ఆ తల్లి కుటుంబాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దింది. పిల్లలను ఉన్నతంగా పెంచింది. బిడ్డల అభ్యున్నతి కోసం సర్వం త్యాగం చేసింది. కష్టసుఖాల్లో భర్తకు తోడు నీడగా నిలిచింది. ఆ కుటుంబానికి అన్ని విషయాల్లోనూ తానే అండదండగా ముందుకు నడిపించింది. అటువంటి భార్య దూరమైతే ఆ భర్త బాధ వర్ణనాతీతం. ఎంతో ప్రేమగా పెంచిన తల్లి దూరమైతే ఆ బిడ్డలు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తల్లి మీద ప్రేమతో, తల్లిని మరిచిపోలేక ఓ కూతురు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తల్లి పై ఇంత ప్రేమను కనబరిచే బిడ్డలు కూడా ఉన్నారా అన్న చర్చకు కారణమవుతుంది.
అందమైన కుటుంబంలో విషాదం ... భార్య మృతితో క్రుంగిపోయిన భర్త
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ చుట్టిగుంట సమీపంలో నివాసముంటున్న మండవ కుటుంబ రావుకు 40 ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణ తో వివాహమైంది.వ్యవసాయం, ప్రకృతి సేద్యం పై మమకారంతో కుటుంబరావు తన కుమార్తెకు సస్య అని పేరు పెట్టాడు. అంతే కాదు ఆయన నివాసాన్ని కూడా సస్య క్షేత్రంగా మార్చారు.
నిత్యం బంధుమిత్రుల రాకతో సందడిగా ఉండే ఇంట్లో ఏడాదిన్నర క్రితం అన్నపూర్ణమ్మ అకాల మరణం చెందింది. దీంతో ఒక్కసారిగా ఆ ఇల్లు మూగబోయింది. భార్య మీద విపరీతమైన ప్రేమ ఉన్న కుటుంబరావు భార్య పోయిన బాధ నుండి ఇప్పటివరకు కోలుకోలేదు. నిత్యం ఆమె జ్ఞాపకాలతో జీవనం సాగిస్తున్నాడు.
తండ్రి బాధ చూడలేకపోయిన కూతురు, అమ్మ మీద ప్రేమతో తండ్రికి బహుమానం
విధి ఆడిన వింత ఆటలో బలైపోయిన భార్యను కోల్పోయి తండ్రి పడుతున్న వేదనను చూసిన కుమార్తె సస్య తండ్రి కోసం ఏమైనా చెయ్యాలని భావించింది. తల్లిని మరిచిపోలేక, తల్లి అన్నపూర్ణమ్మను పోలినట్లుగా ఉండే విగ్రహాన్ని తయారు చేయించి, తండ్రికి బహుమతిగా ఇచ్చింది. అమ్మ లేని లోటు తీర్చటం కోసం ఆ విగ్రహాన్ని చూసుకొని కాస్త ఓదార్పు పొందాలని ఆ కూతురు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయిన తల్లి అన్నపూర్ణమ్మ గుర్తులను మర్చిపోలేక ఆమె కుమార్తె సస్య సిలికాన్ వ్యాక్స్ తో తల్లి నిలువెత్తు విగ్రహాన్ని చేయించింది.
తల్లి విగ్రహాన్ని తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చిన కూతురు, తల్లి పుట్టినరోజున వేడుకలు
ఇక ఆ విగ్రహాన్ని తల్లి పుట్టిన రోజు రోజు తండ్రికి అందించింది. తల్లి లేక ఒంటరిగా జీవిస్తున్న తండ్రికి అచ్చం తల్లి మాదిరిగా ఉన్న విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిన కూతురు, అమ్మ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులందరినీ పిలిచి నిర్వహించింది. అచ్చం మనిషిలానే, అన్నపూర్ణమ్మే వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఉన్న విగ్రహాన్ని చూసిన కుటుంబ సభ్యులందరూ అన్నపూర్ణమ్మ తిరిగి వచ్చిందంటూ సంతోషపడుతూ ఆమె విగ్రహంతో కలిసి ఫోటోలు దిగారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చెమర్చిన కళ్ళతో ప్రతి ఒక్కరు ఆమె విగ్రహాన్ని చూశారు.
Recommended Video
కూతురు చేసిన పనికి తండ్రి సంతోషం, బంధుమిత్రుల ఆనందం
భార్య పోయిన బాధలో ఉన్న తనను ఓదార్చడం కోసం బిడ్డ చేసిన పనికి తండ్రి సంతోషం వ్యక్తం చేస్తుండగా, అమ్మ మీద ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేసిన కూతురుని బంధుమిత్రులు అందరూ అభినందిస్తున్నారు. తన భార్య విగ్రహాన్ని చూసుకుంటూ అన్నపూర్ణమ్మ భర్త ఆమెతో గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సాధారణ విగ్రహాల మాదిరిగా కాకుండా మట్టి విగ్రహానికి మైనం పూసి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేశామని, 40 రోజుల్లోనే ఈ విగ్రహానికి రూపం ఇచ్చామని విగ్రహాన్ని తయారు చేసిన శిల్పులు వెల్లడించారు. ఏది ఏమైనా ఉరుకుల పరుగుల జీవితంలో బ్రతికున్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు ఉన్న నేటి రోజుల్లో, అకాల మరణం చెందిన తల్లి కోసం, ఆమె మీద ప్రేమతో ఆ కూతురు చేసిన పని అందరి ప్రశంసలను అందుకుంటుంది. రక్త సంబంధాలకు, మానవ అనుబంధాలకు నిజమైన అర్థం చెబుతుంది.