టీడీపీ కోసం ఏపీలో ప్రముఖ పత్రిక సర్వే - ఏం తేల్చింది..!!
ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. పార్టీల బలాబాలపైన సర్వేలు మొదలయ్యాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో ఈ సారి టీడీపీని అడ్డుకొని..అధికారంలో కొనసాగితే ఇక భవిష్యత్ లో తనకు తిరుగులేదనే అంచనాల్లో సీఎం జగన్ ఉన్నారు. అందులో భాగంగానే వై నాట్ 175 సీట్ల నినాదం తో ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు.
క్షేత్ర స్థాయి సర్వేలో కీలక అంశాలు
చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుందనే పేరున్న ఒక ప్రముఖ దిన పత్రిక ఏపీలో క్షేత్ర స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ప్రముఖ పత్రికాధిపతి ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ సర్వే నివేదిక అందిందని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న తమ సిబ్బంది కి తోడుగా ఒక ప్రముఖ సర్వే సంస్థకు చెందిన సిబ్బందితో కలిపి ఈ సర్వే చేయించారని సమాచారం. అందులో భాగంగా.. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏ రకంగా ఫలితాలు ఉంటాయి.. అదే సమయంలో జనసేన తో కలవటం ద్వారా కలిసొచ్చే అంశాలు ఏంటి. జనసేన- బీజేపీ రెండు పార్టీలు కలిస్తే కలిగే ప్రయోజనం ఏంటనే అంశాలతో పాటుగా ప్రభుత్వం పైన వేటి పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విధంగా భిన్న కోణాల్లో ఈ సర్వే జరిగింది. అందులో ప్రధానంగా వైసీపీని ఓడించాలంటే పొత్తు కీలకమని తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం.

పొత్తులతో వెళ్తేనే లక్ష్యం చేరేది
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడితేనే అధికారం దగ్గర అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో యువత టీడీపీకి దగ్గర అవుతున్నా..అదే స్థాయిలో మహిళ ఓట్ బ్యాంక్ టీడీపీకి తగ్గిందని తేల్చినట్లుగా చెబుతున్నారు. అర్బన్ ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందని..కానీ, గ్రామీణ ప్రాంతంలో మాత్రం వైసీపీ బలం తగ్గలేదనే విషయాన్ని సర్వేలో తేల్చినట్లు సమాచారం. సీట్ల కేటాయింపులో వైసీపీ చెబుతున్న సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం పార్టీ పైన పడకుండా ముందుగానే ప్రస్తుత ఇంఛార్జ్ లతో పాటుగా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న వర్గాల వారితో ప్రత్యామ్నాయ పేర్లను సిద్దం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో త్రిముఖ పోరు తప్పదని సర్వే తేల్చినట్లు సమాచారం. అదే విధంగా.. జనసేనతో పొత్తు ఖాయమైతే..సీట్ల విషయంలోనూ సూచనలు చేసినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.

హోరా హోరీగానే గ్రౌండ్ రియాల్టీ
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడవద్దని.. పథకాల ప్రభావం లబ్దిదారుల పైన ఎక్కువగా ఉందని తేల్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటే రాజకీయంగా నష్టం తప్పదని అంచనాకు వచ్చారని చెబుతున్నారు. గోదావరి - ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాతో పాటుగా.. కోస్తాలోని రెండు జిల్లాల్లో టీడీపీ - జనసేన పొత్తు ద్వారా ఆశించిన స్థాయిలో సీట్లు వస్తాయని సర్వే అంచనాకు వచ్చింది. అదే సమయంలో.. రాయలసీమలో మాత్రం హోరా హోరీ పోరు తప్పదని తేల్చినట్లు చెబుతున్నారు. ఎన్నికల వేళ వైసీపీ అధికారంలో ఉండటంతో.. కొన్ని అంశాలు కలిసొచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక స్పష్టం చేసింది. దీంతో..వైసీపీ అనుకున్న స్థాయిలో ఏకపక్షంగా గెలిచే పరిస్థితి..ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా అధికారంలోకి రావటం అంత సులువు కాదనేది ఈ సర్వే ద్వారా తేలిందని పార్టీ నేతల అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. దీంతో..సమయం దగ్గర పడేకొద్దీ ఏపీలో ఎన్నికల ఉత్కంఠ మరింత పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications