వివాహేతర బంధానికి భార్య బలి: ప్రియురాలు ఆత్మహత్య, అతను కూడా..
అనంతపురం: వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణాలు తీయగా, మరో యువకుడి ప్రాణాలమీదకి తెచ్చింది. పెళ్లిన యువకుడితో ఓ యువతి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఆ తర్వాత అతడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భయాందోళన చెందిన సదరు యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుమ్మఘట్ట మండలంలోని బిటిపి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఆశాబీ(17), ఆమె తల్లి గోరీబీలు బీటీపీ గ్రామంలో కొన్నేళ్ల నుంచి నివాసముంటున్నారు.
కాగా, యువతి తండ్రి 14 యేళ్ల క్రితమే తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరే ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రా మానికి చెందిన బెస్త రఘు.. ఆశాబీతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ తతంగం రెండేళ్ల పాటుగా కొనసాగుతుండగా.. విషయం తెలిసిన బెస్త రఘు భార్య కవిత ఐదు నెలల క్రితమే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎటువంటి కేసు లేకుండా రాజకీయ పలుకుబడితో రఘు బయటపడ్డాడు.

ఆ తర్వాత ఆశాబీతో వివాహేతర సంబంధాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం ఆశాబీ తల్లి గోరీబీకి తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆశాబీ ఇంటికెళ్లిన రఘుకు.. ఆమె ఇంట్లో లేక పోవడాన్ని గమనించాడు. అప్పుడు ఆమె పక్కనున్న తన మేనమామ ఇంటికెళ్లింది.
కాగా, ఆశాబీ ఇంటికి వచ్చిన వెంటనే రఘు ఆగ్రహంతో ఆమెను చితకబాదినట్లు తల్లి గోరీబీ ఆరోపిస్తున్నారు. అవమానంగా భావించిన ఆశాబీ విషపు గోలీలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తల్లి, ఇరుగుపొరుగు బాధితురాలిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆశాబీతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న బెస్త రఘు.. యువతి మృతి చెందిందన్న విషయం తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన రఘు మంగళవారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
కాగా, రఘు అర్ధరాత్రి ఆశాబీని విచక్షణారహితంగా కొట్టి చంపాడని బాధితురాలి బంధువులు, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications