ఏడాదిపాటు చనువుగా తిరిగి పెళ్లంటే..: ప్రియుడి ఇంటి ముందు మోడల్ ధర్నా
గుంటూరు: సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంవత్సరంపాటు గడిపాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తోంది. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
సోషల్ మీడియా ద్వారా ప్రేమ
వివరాల్లోకి వెళితే.. గుంటూరు శ్రీనగర్కు చెందిన అక్షయదీప్తి దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతూ మోడలింగ్ చేస్తోంది. ఏడాది క్రితం పాత గుంటూరుకు చెందిన పల్వాది చైతన్యతో సోషల్ మీడియా(వాట్సప్, ఫేస్బుక్) ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చైతన్య విజయవాడలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు.
పెళ్లంటే..
ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా.. చైతన్య తల్లిదండ్రులు కట్నం ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, తాము అంత ఇచ్చుకోలేమని దీప్తి తల్లిదండ్రులు వెనుకడగు వేశారు. కాగా, ఆ తర్వాత కూడా దీప్తితో చైతన్య చనువుగా ఉంటూ వచ్చాడు. అయితే, పెళ్లికి మాత్రం అంగీకరించకపోవడంతో దీప్తి అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పరిస్థితి మారలేదు..
చైతన్యను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని వైఖరి మారలేదు. అతనే కావాలని భావించిన దీప్తి, ఎస్పీ గ్రీవెన్స్ సెల్ను కూడా ఆశ్రయించింది. అయినా పరిస్థితి తనకు అనుకూలంగా మారక పోవడంతో గురువారం నుంచి చైతన్య ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది.
లొంగిపోయిన ప్రియుడు..
ఇదిలావుండగా, చైతన్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా, చైతన్య పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. దీప్తిని చేసుకునేందుకు అతను నిరాకరించడంతో కేసు పెట్టి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. చైతన్యకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అరండల్ పేట స్టేషన్లో చైతన్య తరఫున ఓ పోలీసు అధికారి తనకు బేరం పెట్టాడని దీప్తి ఆరోపించింది.