SARTHAK-PDS scheme: రేషన్ దారులకు కేంద్రం బిగ్ న్యూస్-25,530 కోట్లతో..!
దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సాంకేతికత ఆధారిత సంస్కరణల ద్వారా సమూలంగా మార్చే దిశగా కేంద్రం ఇవాళ ఓ కీలక అడుగు వేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ 'సార్థక్-పీడీఎస్' పథకాన్ని రూ.25,530 కోట్ల ఆర్థిక కేటాయింపుతో మార్చి 2031 వరకు ఐదేళ్లపాటు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), ప్రస్తుత నిధుల విధానాన్ని కొనసాగిస్తూనే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రంలోపల ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, రేషన్ షాపుల డీలర్ల మార్జిన్ల కు కేంద్రం అందించే సాయం నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది.
సార్థక్-పీడీఎస్ (SARTHAK-PDS scheme)ను ఒక గొడుగు పథకంగా మార్చి, ఇందులో ప్రస్తుతం ఉన్న రెండు కార్యక్రమాలను విలీనం చేయబోతోంది. అవి: "జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద రాష్ట్రంలోపల ఆహార ధాన్యాల రవాణా , ఎఫ్పిఎస్ డీలర్ల మార్జిన్ కోసం రాష్ట్ర ఏజెన్సీలకు సహాయం. ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునీకరణ, సంస్కరణల పథకం ఆర్థిక సహాయం, సాంకేతిక ఆధునీకరణను ఒకే పరిపాలనా చట్రం కిందకు తీసుకురావడం ద్వారా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలును సమగ్రంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.

లబ్ధిదారుల ఎంపిక నుండి ఆహార ధాన్యాల రవాణా వరకు, పౌరుల నుండి చురుకైన అభిప్రాయ సేకరణ, రవాణా దూరాన్ని తగ్గించడం వరకు ఈ కార్యకలాపాలన్నింటికీ ఐదేళ్ల కాలానికి రూ. 25,530 కోట్ల కేటాయింపుతో ఆమోదం లభించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీడీఎస్ దుకాణాలకు ఆహార ధాన్యాల రవాణా ఖర్చును భరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, ఈ పథకం కింద ఈ ఖర్చుకు మద్దతు ఇస్తామన్నారు. అలాగే ఎఫ్పిఎస్ డీలర్ల పారితోషికం కూడా పెంచుతామన్నారు. సార్థక్-పిడిఎస్ ప్రస్తుత పిడిఎస్ వ్యవస్థను భర్తీ చేయదని, కానీ ఆహార ధాన్యాల పంపిణీ, లాజిస్టిక్స్, రవాణా, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫిర్యాదుల పరిష్కారం వంటి రంగాలలో నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావడానికి దీనిని రూపొందించినట్లు వైష్ణవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications