ఒక భారీ చోరీ: ఎన్నో ట్విస్ట్ లు... ఓనర్ కూడా అరెస్ట్... ఏం ఫ్యామిలీరా బాబు!
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అయితే ఈ దోపిడీ జరిగిన విధానం, ఇందులో చోటు చేసుకున్న ట్విస్ట్ లు చూసి పోలీసులే షాక్ తిన్నారు.
చివరకు దోపిడీకి పాల్పడిన వ్యక్తితో పాటు చోరీ జరిగిన ఇంటి యజమానురాలు, ఆమె కుమార్తెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక మలుపులతో పోలీసులనే విస్మయానికి గురిచేసిన ఈ వెరైటీ చోరీ కేసు వివరాలను పెందుర్తి క్రైమ్ పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే?..
భారీ చోరీ...సంచలనం
విశాఖ జిల్లా పెందుర్తి లోని త్రివేణి ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ కోట ఉమాశంకర్ ఇంట్లో ఈ నెల రెండవ తేదీ రాత్రి భారీ చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తన ఇంట్లో 80 తులాలు బంగారం, కిలోన్నర వెండి, రూ.5.4 లక్షల నగదు చోరీకి గురయిందంటూ కోట ఉమాశంకర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ దోపిడీ కేసును చేధించారు. అయితే ఈ చోరీ జరిగిన క్రమం, అందులో చోటు చేసుకున్న అనేక మలుపులు పోలీసులనే విస్మయానికి గురిచేశాయి.
స్నేహితుడే దొంగ...మొదటి ట్విస్ట్
త్రివేణి ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ కోట ఉమాశంకర్ కుమారై లఖిత కు పురుషోత్తపురంలో గల బాలాజీ హైఫీల్డ్ స్కూలులో నాన్ టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న యెన్నేటి రవికిరణ్ తో పరిచయం ఉంది. పాత పెందుర్తిలో నివసిస్తున్న రవికిరణ్ కు ముందే వివాహమై ఒక కూతురు కూడా ఉంది. ఈ నేపథ్యంలో లఖిత తో స్పేహాన్ని, ఆమె అమాయకత్వాన్ని రవికుమార్ ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నానని, సాయం చేయాలని లిఖితను అర్థించాడు. దీంతో ఆమె తన వద్ద ఎక్కువ డబ్బు ఉండదని చెప్పింది. దీంతో వీరిద్దరూ కలిసి ఆలోచన చేసి లిఖిత ఇంట్లోనే చోరీకి వ్యూహం పన్నారు.
ఇంట్లోనే దొంగతనం...రెండో ట్విస్ట్
ముందుగా అనుకున్న ప్రకారం లఖిత తన తల్లిదండ్రులు ఉమాశంకర్, మహాలక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి రవికిరణ్ కు సమాచారం ఇచ్చింది. దీంతో ఇంట్లోకి చొరబడిన అతడు బీరువాలోని 30 తులాల బంగారం, 640 గ్రాముల వెండి, రూ. 3 లక్షల 3000 నగదు తీసుకెళ్లిపోయాడు. అనంతరం తల్లిదండ్రులు ఇంటికి రాగానే లఖిత ఇంట్లో చోరీ జరిగిందంటూ తన తల్లి మహాలక్ష్మికి తెలిపింది. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి బీరువాను పరిశీలించగా మొత్తం సొత్తులో కొంత డబ్బు, నగలు మాత్రమే చోరీకి గురైన విషయాన్ని గమనించింది. బీరువాలోని లాకర్లో ఉన్న 40 తులాల బంగారం, 1400 గ్రాములు వెండి, రూ.2,37,000 భద్రంగానే ఉన్నాయి.
భారీ అబద్దం...మూడో ట్విస్ట్
దీంతో ఆమె కొంత సొత్తే చోరీకి గురైందన్న విషయం దాచిపెట్టి మొత్తం సొత్తు చోరీకి గురైందని భర్తతో చెప్పింది. ఆ మిగతా సొత్తును భర్తకు తెలియకుండా దాచేసింది. దీంతో డాక్టర్ ఉమాశంకర్కు తన భార్య చెప్పిన సమాచారం మేరకు మొత్తం సొత్తు 80 తులాలు బంగారం, కిలోన్నర వెండి, రూ.5.4 లక్షల నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేశారు. సిసి ఫుటేజ్ ఆధారాలను పరిశీలించారు. ఆ తరువాత ఇంటి సమీపంలో ఉన్న ఒక సిసి కెమేరా ఫుటేజ్ లో రవి కిరణ్ సంచారాన్ని గుర్తించి అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ తరువాత అతడు చెప్పిన విషయాలు తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోయారు.
దొంగతో పాటు...ఓనర్లు అరెస్ట్...ఫైనల్ ట్విస్ట్
దీంతో స్నేహాన్ని అడ్డుపెట్టుకొని దొంగతనానికి పాల్పడిన మాయగాడు రవికిరణ్ తో పాటు అతడికి సహకరించిన ఇంటి యజమాని డాక్టర్ ఉమాశంకర్ కుమార్తె లఖితను, చోరీకి గురైన సొత్తు విషయంలో భర్తకే అబద్దం చెప్పి కొంత సొమ్ము సైడ్ చేసిన డాక్టర్ ఉమా శంకర్ భార్య మహాలక్ష్మినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ దోపిడీలో చోటుచేసుకున్న ట్విస్ట్ ల గురించి పోలీసుల ద్వారా వెల్లడి కావడంతో ఈ చోరీ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.