ఆ లిస్ట్లో పేరు లేకుంటే రేషన్ కార్డు కట్, తాజా ఉత్తర్వులు..!!
అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ జరిగిన తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసే తుది లిస్టులో గనుక పేరు లేకపోతే, ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయనే వార్తలు ఇప్పుడు లబ్దిదారుల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. అయితే, దీని పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎస్ఐఆర్ అనంతరం విడుదల చేసిన ఓటరు లిస్టులో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆలోచన విమర్శ లకు కారణంగా మారుతోంది. రాష్ట్రంలో కొలువుదీరిన నూతన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనర్హులైన లబ్ధిదారులు, అక్రమ విదేశీ పౌరుల రేషన్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026 ఓటరు లిస్టులో అనర్హులుగా తేలిన పీడీఎస్ లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు. వాస్తవానికి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జూన్ 4నే విడుదల చేసారు.

కాగా, ఈ ప్రక్రియ జూన్ 15 నాటికి పూర్తి చేయాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశా ల్లో అక్కడి ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. దీంతో.. ఇతర రాష్ట్రాల్లోనూ అర్హతకు మించి రేషన్ కార్డులు ఉన్నాయని పలుసార్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పేర్కొన్నాయి. రేషన్ కార్డులను తొలగించాలంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉండటంతో వాటి జోలికి ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం పోలేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తి అయితే, వాటి రూపంలో రేషన్ కార్డును తొలగించే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడినా, వెంటనే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారాగాని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద గాని ఫామ్-6 సమర్పించి పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications