రేపు ఏపీ కేబినెట్ భేటీలో ఆ పథకంపై కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ క్యాబినెట్ బెట్టిలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపైన భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.
ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారని అంతా భావించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ పండుగ వచ్చినా ఏపీలో మహిళలు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తారని భావించినప్పటికీ సంక్రాంతికి కూడా ఈ పథకాన్ని అందించలేకపోయారు.

క్యాబినెట్ భేటీలో ప్రధానంగా వీటిపైనే చర్చ
ఇక ఇప్పుడు ప్రజలు ఉగాది పైన ఆశలు పెట్టుకున్న వేళ రేపు జరగనున్న క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన చర్చ జరపనున్నారు. ఇది మాత్రమే కాకుండా రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూ కేటాయింపులు, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించటం తదితర అంశాల పైన కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు.
బనకచర్ల ప్రాజెక్టు పైన చర్చ
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ విషయం పైన కూడా క్యాబినెట్ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టడంతో రేపు వాలంటీర్లు అమరావతిలో జరిగే ఏపీ క్యాబినెట్ భేటీకి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
క్యాబినెట్ భేటీపై ఆసక్తి
ఇక రేపు క్యాబినెట్ భేటీ అనేక కీలక విషయాల పైన చర్చలతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వాలంటీర్లు సీఎం ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ భేటీ ఆసక్తిని కలిగిస్తుంది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పాలనపరమైన అంశాల పైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications