విద్యార్థులతో కలిసి యువతి పట్ల లెక్చరర్ అసభ్యప్రవర్తన
తూర్పుగోదావరిం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ గురువు తానే కొందరు విద్యార్థులతో కలిసి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వేధింపులకు పాల్పడుతున్న లెక్చరర్ తోపాటు నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. కాకినాడలోని విద్యుత్నగర్లోని ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాలలో కాకినాడకు చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో కాకినాడలోని శ్రీనగర్కు చెందిన వీరపల్లి వీరదీపక్ లెక్చరర్గా పని చేస్తున్నాడు.
అతడు కొంతకాలంగా ఆ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అతనికి బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శ్రీనివాస్, రోహిత్, విజయబాబు, వెంకటేష్ సహకరించారు. గత ఆదివారం ఆన్లైన్లో పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లగా.. తమకు సహకరించాలని, లేదంటే కారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడతామని బెదిరింపులకు గురిచేశారు.
అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తామని హెచ్చరించారు. మూడు రోజుల్లోగా చెప్పాలని తమకు సమాధానం చెప్పాలని ఆమెను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువతి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వారు బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లెక్చరర్ తోపాటు నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.