దారుణం: మద్యానికి డబ్బివ్వలేదని తల్లి, అన్నను నరికేశాడు
కడప: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగడానికి డబ్బివ్వలేదని తల్లిని, అడ్డువచ్చిన అన్నను దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రైల్వేకోడూరు మండలం చీయవరం గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గంధారపు సుబ్బమ్మ (62), వెంకటయ్య దంపతులు. వీరికి సుబ్రహ్మణ్యం(42), శంకరయ్య(శివశంకర్), సుబ్బరాయుడు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో అంతా పొలం పనులపైనే ఆధారపడ్డారు.
అందరికీ వివాహాలు కావడంతో వేరు కాపురాలు పెట్టుకున్నారు. కొన్నాళ్లకు భర్త కాలం చేయడంతో సుబ్బమ్మ పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం వద్ద ఉంటోంది. సుబ్రహ్మణ్యం- శంకరయ్యలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడుతుండే వారు. ఆస్తులు, డబ్బులంటూ నిత్యం ఘర్షణకు దిగుతుండేవారు.
ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట శ్రీరామ నవమి సందర్భంగా సుబ్రహ్మణ్యం శంకరయ్యను కత్తితో పొడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పుడు అతడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంతో కోలుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అన్నదమ్ముల మధ్య మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పీకల దాకా మద్యం తాగిన శంకరయ్య.. అన్న ఇంటిపై గొడవకు వెళ్లాడు. అడ్డం వచ్చిన తల్లిని కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అదే కోపంతో అన్నపైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచి అక్కడ్నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు గాయపడిన సుబ్రహ్మణ్యంను 108 వాహనంలో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను ప్రాణాలొదిలాడు. మృతుని భార్య రమణమ్మ కువైట్లో ఉండగా వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొంత భయానక వాతావరణం నెలకొంది.
స్థానికుల సమాచారంతో సీఐ రసూల్సాహెబ్, ఎస్సై మంజునాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలోనే ఉన్న నిందితుడు శంకరయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.