నిత్య పెళ్లి కొడుకు: మూడు పెళ్లిళ్ల తర్వాత, బీటెక్ యువతితో పరార్
హైదరాబాద్: ఇప్పటికే మూడో పెళ్లిళ్లు చేసుకుని మరో యువతిని ఎత్తుకెళ్లాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. కేసు నమోదు చేసి, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కార్మికనగర్లో నివాసముంటున్న నిందితుడు సయ్యద్ నిసార్ సొహైల్(27) కొంతకాలం క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు.

అంతటితో ఆగకుండా రెండో భార్యను వదిలేసి ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఇది ఇలా ఉండగానే, ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని(23)తో దగ్గరయ్యాడు సొహైల్.
కాగా, ఆ యువతికి మే 1న పెళ్లి నిర్వహించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ లోపే సొహైల్, ఆ యువతి (ఏప్రిల్ 17వ తేదీ) నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు సొహైల్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పోలీసుల దర్యాప్తులో సొహైల్పై మూడు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడైంది.












Click it and Unblock the Notifications