మహిళలు, యువతులే లక్ష్యంగా ‘సిరంజీ’ సైకో దాడులు: ఆస్పత్రి పాలైన 11మంది
పశ్చిమగోదావరి: ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా సిరంజీలతో దాడులకు పాల్పడుతూ ఓ సైకో భయాందోళనలకు గురిచేస్తున్నాడు. నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.
మహిళలు, యువతులనే లక్ష్యంగా చేసుకుని అతడు దాడి చేస్తుండడంతో వారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామం వద్ద.. ఆగస్టు 22న బడికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపై ఆగంతకుడు ఇంజెక్షన్తో దాడి చేసి వారికి గుచ్చడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆ ఇరువురి రక్తాన్నీ సేకరించి పరీక్షలకు పంపించారు.
ఆ తర్వాత మూడు రోజులకు.. మంగళవారం పాలకోడేరు మండలం గొరగనమూడిలో ఉదయం ఆరున్నరకు ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న ఆర్టీసీ మహిళా కండక్టర్కు వెనుక నుంచి వచ్చి ఈ సూదిని బలవంతంగా గుచ్చడంతో ఆమె కేకలు వేసింది. తదుపరి 9 గంటల సమయంలో ఇదే మండలం కుముదవల్లి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికను వెనుక నుంచి వచ్చి సూదితో గుచ్చాడు.
మరో గంటన్నర తరువాత ఇదే మండలంలోని వేండ్ర శివారు కట్టా వారిపాలెంలో నడిచి వెళుతున్న ఓ వివాహితకు ఇదేవిధంగా వెనుక నుంచి సూది గుచ్చాడు. తదుపరి 11 గంటల సమయంలో వేండ్ర శివారు సుబ్బరాజుపాలెం వద్ద చౌక డిపోకు నడిచి వెళుతున్న ఇద్దరు యువతులకు కూడా ఇదే విధంగా వెనుక నుంచి సూది గుచ్చాడు. వారు తేరుకునే సరికే అతను కనిపించకుండా మాయమయ్యాడు.
గణపవరం మండలం కేశవరం గ్రామంలో కూడా ఓ గృహిణిపై సూది మందు దాడి జరిగింది. దాడికి గురైనవారిలో ముగ్గురికి మాత్రం శరీరంలో సూదులు ఉండిపోయాయి. దీంతో, వీరి రక్త నమునాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపిస్తున్నారు. కాగా, ఆ సైకో నీలి రంగు చొక్కా, జీన్ ఫ్యాంట్ ధరించి, ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉన్నాడని.. పల్సర్ వాహనంపై వచ్చాడని.. వారు చెబుతున్నారు.
బుధవారం ఉదయం కూడా పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు, వీరవాసరం మండలం బుదరాయుడు చెరువులో యువతికి, పోడూరు మండలం కవటంలో మరో యువతికి ఇంజక్షన్ ఇచ్చిన ఆ సైకో పరారయ్యాడు. కాగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.