టెక్కీ ఆత్మహత్య: భార్యతో విభేదాలే కారణమా?
కడప: జిల్లాలోని బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామంలో విషాదం నెలకొంది. భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి(32) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ బుధవారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, నరసమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో సంతానమైన వెంకటసుబ్బారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు 13 నెలల క్రితం బి.మఠం మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన స్వర్ణలతతో వివాహమైంది.
స్వర్ణలత కూడా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న వెంకటసుబ్బారెడ్డి కొద్దిసేపటికే ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రులు కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు.
కొన్ని నెలలుగా భార్యభర్తల మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఇరువురు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తన భార్యను కాపురానికి రావాలని అడుగుతున్నప్పటికీ రాకుండా వేధింపులకు గురి చేస్తుండేదని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.