ఈ టెక్కీ శాడిజం అంతాఇంతా కాదు: కొడుకు తనకు పుట్టలేదని భార్యకు నరకం
విశాఖపట్నం: అతను చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాత్రైతే చాలు తాగి తందనాలాడాల్సిందే. ఆ తర్వాత ఇంటికొచ్చి భార్యను నరకం చూపిస్తాడు. అంతేగాక, కట్టుకున్న భార్యపై అనుమానం. తన కొడుకు తనకు పుట్టలేదంటూ శాడిజం చూపేవాడు. ఈ శాడిస్ట్ భర్త వేధింపులు తాళలేక.. అత్తామామల నుంచి కూడా మద్దతు లభించకపోవడం ఆ మహిళ.. మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎన్జీజీవోస్ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి నక్కా మల్లేశ్వరరావు, లక్ష్మీ దంపతులు ఎంసీయే చదవిన తమ కుమార్తె జ్యోతిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పర్లాకిమిడికి చెందిన కొత్తపల్లి విజయానంద్కిచ్చి 2010లో వివాహం జరిపించారు. కట్నకానుకల కింద 20 లక్షల నగదు, 20 తులాల బంగారం అందజేశారు.
వారికి మగబిడ్డ జన్మించిన అనంతరం భార్య జ్యోతి, కుమారుడు రంజివదిరాజ్ను తీసుకొని విజయానంద్ అమెరికా వెళ్లాడు. అక్కడ అతడు నిత్యం రాత్రిపూట పది మంది స్నేహితులతోఇంటికి వచ్చి తెల్లార్లూ మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తుండేవాడు. ఆ సమయంలో అనారోగ్యానికి గురైన జ్యోతి కుమారుడిని తీసుకుని ఇండియా వచ్చింది.

పర్లాకిమిడి వెళ్లి భర్త ఆగడాలను అత్తమామలు లక్ష్మీకాంతం, కృష్ణమూర్తికి తెలియజేయగా..'వాడు మగాడు. పది మంది కాకపోతే వందమందితో తిరుగుతాడు. నువ్వు నోరు మూసుకుని ఉండాల్సిందే. అసలు మా స్థాయికి తగ్గ సంబంధం కాకపోయినా చేసుకోవడం మాది తప్పు. అదనపు కట్నం తీసుకువస్తే అప్పుడు చూద్దాం' అని బదులివ్వడంతో జ్యోతి నిశ్చేష్టురాలైంది.
అయితే పెద్దల జోక్యంతో 2013లో జ్యోతిని, బాబుని విజయానంద్ అమెరికా తీసుకువెళ్లినా వీసా ఇబ్బందులు రావడంతో అంతా ఇండియా తిరిగి వచ్చేశారు. భార్య,కుమారుడిని విశాఖ పంపించేసిన విజయానంద్ పత్తాలేకుండా పోయాడు. 2014లో జ్యోతికి ఆపరేషన్కు భర్త అనుమతి అవసరం కాగా, విజయానంద్ స్పందించలేదు.
ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విజయానంద్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కుమారుడు రంజివదిరాజ్ తనకు పుట్టలేదని, జ్యోతికి మానసిక రుగ్మత ఉందని విజయానంద్ ఎదురుతిరగడంతో పోలీసులు చేతులెత్తేశారు.
అప్పటి సీపీ అమిత్గార్గ్ ఆదేశాలతో మరోసారి విజయానంద్ను పిలిచి మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఇది ఇలా ఉండగా, కొడుకు తనకు పుట్టలేదని తన భర్త విజయానంద్ ఆరోపిస్తున్నందున విజయానంద్కు, తన కుమారుడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవం వెలుగులోకి వస్తుందని బాధితురాలు జ్యోతి పేర్కొంది. తనకు న్యాయం చేయాలని లేనిపక్షంలో కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని జ్యోతిక వాపోయింది.












Click it and Unblock the Notifications