ప్రియురాలికి పెట్టిన ఖర్చు చెల్లించాలని టెక్కీ ఫిర్యాదు!
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులు ఓ విచిత్రమైన ఫిర్యాదును స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే.. తాను ప్రేమించిన యువతి తనను మోసం చేసి.. మరో వ్యక్తితో పెళ్లి చేసుకుందని చెప్పిన ప్రియుడు.. ఆమెపై కేసు పెట్టి, తాను ఆమె కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇదెక్కడి కేసురా.. బాబూ అనుకున్నారు పోలీసులు. ఏదో నీతి వాక్యాలు చెప్పి పంపిద్దామనుకున్నారు. అయితే ఆ ప్రేమికుడు మాత్రం కేసు నమోదు చేయాల్సిందేనని చెప్పి, పోలీసులకు తన ఫిర్యాదు ఇచ్చి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న ఓ యువకుడు, అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతిని ఇష్టపడ్డాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ప్రేమ చిగురించింది.

రోజూ సాయంత్రం, వారాంతంలలో షాపింగ్లు, సరదాలు, షికార్లు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఆమె తల్లిదండ్రులు నిశ్చయించిన వ్యక్తితో ఆ యువతికి వివాహం జరిగింది. అయితే వివాహం చెడగొట్టేందుకు కూడా బాధిత ప్రేమికుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవన్నీ విఫలం కావడంతో.. ఇన్నాళ్లు ఆమె కోసం పెట్టిన ఖర్చుల జాబితాను తయారు చేసిన బాధిత ప్రేమికుడు, సోమవారం పోలీసులను ఆశ్రయించాడు.
ఆ ఖర్చులన్నింటినీ ఆమె నుంచి తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫిర్యాదు ఇంతవరకూ చూడని పోలీసులు... తొలిసారిగా రావడంతో కంగుతిన్నారు. ఎవో నీతులు చెప్పి పంపిద్దామనుకున్నా.. అతడు వినకపోవడంతో ఫిర్యాదు స్వీకరించి అతన్ని పంపించేశారు. ఫిర్యాదు స్వీకరించినా కేసు మాత్రం నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications