తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా?: చంద్రబాబుకు ట్రైనీ ఐఏఎస్ ప్రశ్న
ముస్సోరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తన ప్రశ్నతో సందిగ్ధంలో పడేశారు ఓ యువ ట్రైనీ ఐఏఎస్. మంగళవారం చంద్రబాబునాయుడు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీలో యువ ట్రైనీ ఐఏఎస్లను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.
ప్రసంగం అనంతరం చంద్రబాబునాయుడు ట్రైనీ ఐఏఎస్లతో కొంత సరదాగా గడిపారు. ఈ సమయంలో పలువురు ఐఏఎస్లు అడిగి ప్రశ్నలుకు తీరిక సమాధానం చెప్పారు చంద్రబాబు. కాగా, ఓ ఐఏఎస్ మాత్రం చంద్రబాబును సందిగ్ధంలో పడేసే ప్రశ్న వేశారు.
‘సార్, భవిష్యత్తులో విడిపోయిన తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయని భావిస్తున్నారా?' అని ఓ ట్రైనీ ఐఏఎస్ ప్రశ్నించారు. దీంతో అక్కడ కొంతసేపు నవ్వులు పూశాయి. అయితే సమాధానం చెప్పాలో తెలియక చంద్రబాబు కొంత తటపటాయించారు.
ఆ తర్వాత సర్దుకుని ‘విభజన గతించిన చరిత్ర. ఇక మీదట రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా' అని చంద్రబాబునాయుడు వారికి సమాధానమిచ్చారు.