విషాదం: పెళ్లైన ఏడు రోజులకే నవవధువు ఆత్మహత్య, వరుడు కన్నీరుమున్నీరు
తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం మేడపాడు, కోరుకొండ మండలం గాదరాడలో విషాదం నెలకొంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఏడు రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లు కట్టి పెళ్లి చేసుకున్నాడు..
వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్తో జూన్ 29న వివాహం జరిగింది. వరుసకు మేనమామ అయ్యే అశోక్.. తాపీ పనిచేస్తుంటాడు. ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన అశోక్.. అశ్వినీ స్వాతిని వివాహమాడాడు.
నవవధువు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరుగా విలపించిన వరుడు
రెండు రోజుల క్రితం ఈ కొత్త జంట గాదరాడకు వచ్చింది. అయితే, ఆషాఢ మాసం వస్తుండటం, మంచిరోజు కావడంతో సోమవారం సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపడానికి సిద్ధం చేశారు. అయితే, ఇంట్లో అందరూ ఉండగానే గదిలోకి వెళ్లిన స్వాతి.. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అశ్వినీ మృతి భర్త అశోక్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
రాజీ చేసుకున్నా.. చివరకు పోలీసుల ఎంట్రీ..
అయితే, స్వాతి మృతి విషయాన్ని బయటికి రాకుండా ఇరుకుటుంబాలవారు రాజీ కుదుర్చుకున్నారు. దగ్గరి బంధువులే కావడంతో విషాదాన్ని తమ మధ్యే ఉంచుకున్నారు. అయితే, బంధువుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్వాతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
పెళ్లైతే విడిపోతామని కవలల ఆత్మహత్య..
ఇది ఇలావుండగా, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో పెళ్లైతే విడిపోతామని భావించిన ఇద్దరు కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా హణసహళ్లిలో చోటు చేసుకుంది. పెళ్లి వయసు రావడంతో కవల అమ్మాయిలు దీపిక, దివ్య(19)లకు వివాహం చేయాలని నిశ్చయించారు తల్లిదండ్రులు. అయితే, పెళ్లయిన తర్వాత తాము విడిపోవాల్సి వస్తుందని ఆవేదనకు గురైన ఈ కవల యువతులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతుర్ల మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.