పెళ్లై నాలుగు నెలలకే.. అనుమానాస్పదంగా మహిళ ఆత్మహత్య
విశాఖపట్నం: వివాహమైన నాలుగు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతుంటే., భర్త, ఆడపడుచు వేధింపుల వల్లే చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన విశాఖపట్నంలో జిల్లాలోని గాజువాక బీసీరోడ్డు దరి భానోజీతోటలో ఆదివారం చోటు చేసుకుంది.
ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందిన పర్రే రాజు విశాఖ స్టీల్ప్లాంటులో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తూ... భానోజీతోటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాజుకు చోడవరం మండలం నర్సయ్యపేటకు చెందిన సంధ్యతో గత అక్టోబరు 1న వివాహమైంది.

పెళ్లైన నాలుగు నెలలకే..
కాగా, పెళ్లి సమయంలో అత్తింటివారు రూ.4 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించారు. ఈ క్రమంలో రాజు గత శనివారం రాత్రి కణితిరోడ్డులో ఉంటున్న సోదరి నాగమణి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంధ్యను చూసి గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంధ్య ఆత్మహత్యపై అనుమానాలు
దీంతో సోదరి సాయంతో సంధ్య మృతదేహాన్ని తన సొంతూరు బంగారుమెట్టకు తీసుకుపోయి... నర్సయ్యపేటలోని సంధ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంధ్య తండ్రి గంట్ల అప్పారావు ఆదివారం ఉదయం కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు అందించారు. అక్కడి పోలీసులు గాజువాక స్టేషన్కు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.

వేధిస్తున్నారని విలపించిన సంధ్య
సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన సంధ్య అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని విలపిస్తూ చెప్పిందని, సర్థి చెప్పి భర్త వద్దకు పంపితే ఇలా జరిగిందని అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. ధ్య చేతులపై గాయాలు ఉన్నాయని, భర్త, ఆడపడచుల వేధింపుల వల్లే చనిపోయిందని ఆయన గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బంగారుమెట్ట గ్రామంలో పర్రే రాజు ఇంటి దగ్గర ఆదివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నర్సయ్యపేట నుంచి మృతురాలి తల్లిదండ్రులు, బంధువులందరూ బంగారుమెట్ట చేరుకుని ఆందోళన చేపట్టారు. సంధ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారనే ఆగ్రహంతో వారంతా సంధ్య ఆడపడుచు నాగమణిపై దాడి చేశారు.

భర్త, ఆడపడచు అరెస్ట్
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు, భర్త రాజు, ఆడపడుచు నాగమణినిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు సీఐ కె.రామారావు, ఎస్ఐ అప్పలరాజు కేజీహెచ్లో సంధ్య మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ సిబ్బందితో భానోజీతోటలోని ఇంట్లో ఆధారాలు సేకరించారు.












Click it and Unblock the Notifications