అక్క కూతుర్ని పెళ్లాడి.. అనుమానంతో హత్య చేశాడు
కర్నూలు: సొంత అక్క కూతుర్నే ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. అయితే, గత నెలలుగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
సీఐ మురళీధర్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకార.. కానాల గ్రామానికి చెందిన దూదేకుల మాబూసా కొడుకు దూదేకుల పెద్ద మస్తాన్కు కడప జిల్లా మైదుకూరు మండలం శ్రీనగరం గ్రామానికి చెందిన దస్తగిరమ్మ(40)తో 13 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది.
నిందితుడు మస్తాన్కు దస్తగిరమ్మ స్వయానా అక్క కూతురు. కొన్నేళ్ల పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. వీరికి యాసిన్ వలి అనే కొడుకు ఉన్నాడు. వైవాహిక జీవితంలో క్రమేణా ఇద్దరికీ మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు ఆమెకు చెందిన స్థలం డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవపడేవాడు మస్తాన్.
ఈ కార్యక్రమంలో మంగళవారం రాత్రి మస్తాన్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. పొలం పనులకు ఉపయోగించే పికాసి తీసుకొని ఆరుబయట నిద్రపోతున్న భార్య దస్తగిరమ్మను దారుణంగా నరకటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి సీఐ మురళీధర్రెడ్డి, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలను సీఐ.. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు.
కాగా, నిందితుడు మస్తాన్ తన భార్యను హత్య చేసి నేరుగా తాలూకా పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మృతురాలు తమ్ముడు బాలమస్తాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.