ప్రియుడ్ని రోకలిబండతో మోది చంపిన ప్రియురాలు: పీఎస్లో యువతి ఆత్మహత్యాయత్నం
కృష్ణా: తనను మోసం చేస్తున్నాడని తెలిసిన ఓ మహిళ.. తను సహజీవనం చేస్తున్న వ్యక్తిని రోకలిబండతో మోది హత్య చేసింది. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముచ్చెనపల్లి గ్రామానికి చెందిన శాంతకుమార్(30) అనే మహిళ జి.కొండూరు మండలానికి చెందిన పొనుసూరి బాబూ రాజేంద్ర ప్రసంగి (38) అనే వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది.
ఈ క్రమంలో జి.కొండూరు వెళ్లిపోదామని ప్రసంగి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆగ్రహించిన శాంతకుమార్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో రెండు సార్లు మోదింది. తీవ్రంగా గాయపడిన ప్రసంగి అక్కడే ప్రాణాలు విడిచాడు.
కాగా, ఘటన తర్వాత శాంతకుమార్ నేరుగా వెళ్లి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్స్టేషన్లో యువతి ఆత్మహత్యాయత్నం
తనను వేధిస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తూ.. ఓ యువతి పోలీస్స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. మండలంలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన లక్ష్మీఈశ్వరమ్మ (23) గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేసింది.
అయితే తన ఫిర్యాదును పట్టించుకోకుండా ఎస్సై మహేశ్వరయ్య తనను దుర్భాషలాడుతున్నాడంటూ మంగళవారం పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసుల సమక్షంలో క్రిమిసంహారక మందు తాగింది ఈశ్మరమ్మ.
దీంతో ఆమెను వెంటనే పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకరరెడ్డి ఆమెను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications