ఒకే యువతి... మారు పేర్లతో యువకులకు వల... పెళ్లి పేరుతో మోసాలు...
ఒకే యువతి... రకరకాల పేర్లు... బాగా సెటిలైన యువకులకు పెళ్లి పేరుతో గాలం వేసి డబ్బులు గుంజడం ఆమెకు అలవాటు. ఇప్పటికీ ఐదు పెళ్లిళ్లు చేసుకుని... ఆ ఐదుగురినీ అలాగే మోసం చేసింది. ఎట్టకేలకు ఓ కేసులో ఇటీవలే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆ నిత్య పెళ్లి కూతురు కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు.
ఎవరా యువతి...
పోలీసుల కథనం ప్రకారం... ఆ నిత్య పెళ్లి కూతురు పతంగి స్వప్న, పతంగి హరిణి, నందమురారి స్వప్న,కావ్య ఇలా రకరకాల పేర్లతో పలువురిని పరిచయం చేసుకుని మోసగిస్తోంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లికి చెందిన వీరాంజనేయులును మ్యాట్రిమోనిలో పరిచయం చేసుకుంది. తాను ఢిల్లీలో ఐపీఎస్ స్దాయి అధికారినని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర పని చేస్తుంటానని రామాంజనేయులుతో చెప్పింది. డెన్మార్క్లో పనిచేసే రామాంజనేయులు ఆమె చెప్పినవన్నీ నమ్మి 2019,డిసెంబర్ 12, న ఆమెను వివాహం చేసుకున్నాడు.
వీరాంజనేయులుతో వివాహం...
పెళ్లి తర్వాత కొద్దిరోజులకు వీరాంజనేయులుకు భార్యపై అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా ఆమె అసలు స్వరూపం తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించి ఆమెతో చెప్పకుండా అతను డెన్మార్క్ వెళ్లిపోయాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె అతనిపై కేసు నమోదు చేసింది. అయితే పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చి ఆమె నేపథ్యం గురించి విచారించగా పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గతంలోనూ ఆమె పలువురిని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు.
గతంలోనూ మోసాలు...
ఏపీతో పాటు తెలంగాణ,మహారాష్ట్రల్లోనూ ఆమెపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. బెల్జియంలో పనిచేసే నంద్యాల వాసి సుధాకర్ను కూడా ఇలాగే పెళ్లి చేసుకుని అతని నుంచి రూ.25లక్షలు డిమాండ్ చేసినట్లు గుర్తించారు. అంతకుముందు తాను అనాధను అని చెప్పి తిరుపతికి చెందిన పృధ్వీరాజ్ను పెళ్లి చేసుకుని... అతనితోనూ విడిపోయి డబ్బు డిమాండ్ చేసినట్లు గుర్తించారు. పౌరోహిత్యం చేసే దేవక్ శుక్లా అనే పూజారిని కూడా ఆమె పెళ్లి పేరుతో మోసం చేసి రూ.20లక్షలు కాజేసినట్లు గుర్తించారు.
Recommended Video
జైలుకు తరలింపు...
ఒకప్పుడు తిరుపతిలోని ఓ హాస్టల్లో ఉండే ఆమెకు మొదట మేనమామతో వివాహం జరిగిందని చెబుతున్నారు. అతనితో విడిపోయాక... పలువురిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రకాశంలోని దర్శి కోర్టులో ఆమెను హాజరుపరచగా... కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ఒంగోలు సబ్ జైలుకు తరలించారు.