మోసం చేశాడని ప్రియుడి పెళ్లాపిన ప్రియురాలు, పరారీ
మెదక్: తనను ప్రేమించి మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో.. విషయం తెలుసుకున్న బాధిత యువతి మండపానికి వచ్చి పెళ్లి ఆపేసింది. దీంతో తన ప్రియుడు, పెళ్లి కొడుకు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం పడాల్ పల్లిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యావాపూర్కు చెందిన శంకర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాధిత యువతి చాలా రోజులుగా ప్రేమించుకున్నారు. తననే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన శంకర్ ఆమెను శరీరకంగా అనుభవించాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే శంకర్ ఆ తర్వాత మాటమార్చి తనను పెళ్లి చేసుకోలేనని చెప్పడటంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు నిందితుడు శంకర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే ఈ విషయాన్ని దాచిపెట్టిన శంకర్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధిత యువతి పెళ్లి మండపానికి చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని పెద్దలకు వివరించింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. అయితే ఆలోపే శంకర్ అక్కడ్నుంచి జారుకున్నాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. కాగా, ఆగిన పెళ్లిలో వధువును వివాహం చేసుకునేందుకు ఆమె బావ అంగీకరించడంతో వారిద్దరికి పెళ్లి జరిగింది.