లవ్ ఎఫైర్?: యువకుడి దారుణ హత్య, నిందితుల ఇళ్లపై దాడి, కుప్పంలో ఉద్రిక్తత
చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ కాలనీలో ఓ యువకుడి దారుణ హత్యతో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ఆదివారం పక్కింటి వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు, స్నేహితులు.. నిందితుల ఇళ్లపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సద్దుమణిగేలతా చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజగోపాల్, అహ్మదుల్లా(బాషా) కుటుంబాలు కొంతకాలంగా ఎన్టీఆర్ కాలనీలోని పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నాయి.ఈ క్రమంలో బాషా చెల్లెలితో రాజగోపాల్ కుమారుడు కుపేంద్ర(30) ప్రేమ వ్యవహారం సాగించినట్లు సమాచారం. అయితే కుపేంద్రకు ఇటీవల వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ నెలాఖరున వారి పెళ్లి జరగాల్సి ఉంది.

ఈ విషయం తెలుసుకున్న బాషా చెల్లెలు నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్టు తెలిసింది. అదే సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈక్రమంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి కుపేంద్ర వాళ్ల ఇంటి ముందు పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది.
ఈ నీటిని కుపేంద్ర రోడ్డు వైపునకు మళ్లిస్తుండగా.. బాషాతో పాటు అతని సోదరులు అజార్, హమానుల్లా అడ్డుకున్నారు. వాగ్వాదం చోటుచేసుకోవడంతో కుపేంద్ర (30)పై
కత్తులతో దాడికి దిగారు. విక్షచణారహితంగా కత్తులతో నరికారు. ఇంట్లో ఉన్న కుపేంద్ర తల్లి సరస్వతి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లీకొడుకును స్థానికులు తొలుత కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని విక్టరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుపేంద్ర మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. తల్లి సరస్వతి ఇంకా అక్కడే చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, స్నేహితులు ఆగ్రహంతో నిందితుల ఇళ్లపై దాడికి దిగి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఎస్ఐలు, వంద మందికిపైగా సిబ్బందితో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, కుపేంద్ర కుటుంబసభ్యులను సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి, డీఎస్పీ శంకర్లు పరామర్శించారు.
ఈ ఘటనపై పలమనేరు డీఎస్పీ శంకర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణం కల్గిన కుప్పంలో కత్తులతో దాడిచేసుకోవడం ఇదే తొలి సంఘటన అని అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని, బాధిత కుటుంబీకులు ఫిర్యాదుచేసిన నిందితులను అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications