ఏపీలో ఏదీ "ఆధారం"...రాష్ట్రంలో రెండు నెలలుగా నిలిచిపోయిన ఆధార్ నమోదు
ఆధార్ కార్డ్...అధికారికంగా చెప్పినా చెప్పకపోయినా అన్నిటికి ఆధారే ఆధారం అనే విషయాన్నిప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. అందుకే తమంతట తాముగా ఆధార్ తీసుకునేందుకు గతంలో కంటే ఇప్పుడు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి కీలకమైన తరుణంలో ఎపిలో ఆధార్ నమోదు ప్రక్రియ నెలల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆధార్ కార్డు పొందడం గగనమైపోయింది. పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఏకంగా రెండు నెలలుగా ఏపీలో ఆధార్ ఎన్రోల్మెంట్ నిలిచిపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్రోల్మెంట్ సెంటర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. మరోవైపు ఏపీ ఐటీ శాఖ సమస్య నివారణకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆధార్ నమోదు...ఎందుకు ఆగిందంటే...
నిన్న మొన్నటి దాకా ఏపీఆన్లైన్ ద్వారా పనిచేసిన యుఐడిఏఐ సర్వర్లను ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టం సర్వర్లకు అనుసంధానించే పేరుతో నవంబర్ 8న ఆధార్ నమోదు ప్రక్రియను నిలిపివేశారు. అప్పట్నుంచి కొత్త ఆధార్ కార్డు కోసం తిరిగే జనాలకు చుక్కలు కనపడుతున్నాయి. కారణం...అన్ని మీ సేవా కేంద్రాలతో పాటు కార్వీ ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్లకు కూడా సర్వర్లను నిలిపివేయడమే...దీంతో రాష్ట్రంలోని 93 ఏపీ ఆన్లైన్ కేంద్రాలతో పాటు కార్వీలో కూడా ఆధార్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం అతికొద్ది ఈ-సేవా కేంద్రాలు, నాలుగైదు బ్యాంకుల్లో మాత్రమే ఆధార్ రిజిస్ట్రేషన్ కల్పించడం జరుగుతోంది.
భద్రత కోసమే...నిలుపుదల
అయితే ఆధార్ భద్రతపై సందేహాలువ్యక్తమవుతున్ననేపథ్యంలో ప్రైవేట్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ గురించి ఆందోళన వ్యక్తం అవడంతో సర్వర్ కనెక్టివిటీ నిలిపివేశారు. అయితే ఆధార్ ల కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఏపీ ఆన్లైన్ బాధ్యుల నుంచి మళ్లీ ఆధార్ రిజిస్ట్రేషన్ సేవల పునరుద్ధరణ కోసం విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టం అధికారులు యుఐడిఏఐ అనుమతిని కోరారు. ఇప్పటి వరకు ఆధార్ రిజిస్ట్రేషన్లు చాలావరకు ఏపీఆన్లైన్ ద్వారా జరిగి వుండటంతో యుఐడిఏఐ కూడా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ వద్దకు చేరింది. ఎపి ఐటీ శాఖ ఫైల్ క్లియర్ చేసినా సర్వర్ల పునరుద్ధరణ మాత్రం జరగలేదు. ఆధార్ సేవల పునరుద్దరణ ఎందుకు జరగలేదన్నది అంతుబట్టడం లేదు. కేవలం నిరాసక్తతేనా లేక మరేదైనా కారణం ఉందో అర్థం కాని పరిస్థితి.
ఆధార్ సేవలకు...బ్యాంకులు విముఖత...
విజయవాడలో ఉన్న 14 ఈసేవా కేంద్రాల్లో మూడు ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సేవా ఆపరేటర్లు కుడా ఆధార్ రిజిస్ట్రేషన్కు వచ్చే ఆదాయం బాగా తక్కువగా ఉండటం వల్ల బిల్లుల చెల్లింపు తప్ప ఆధార్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించడానికి ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఇక బ్యాంకుల్లో ఆధార్ సెంటర్లను ప్రారంభించినా వీటి వల్ల పెద్దగా ఆదాయం సమకూరకపోవడంతో బ్యాంకులు వీటని అనవసరపు భారంగా భావించి తొలగించేసినట్లు తెలిసింది.
ఆధార్ కోసం గగ్గోలు...
ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, కార్వీల్లో ఆధార్ రిజిస్ట్రేషన్ లేకపోవడం, అవకాశం ఉన్న చోట కూడా ఆధార్ నమోదుకు సిబ్బంది నిరాకరిస్తుండటం జనం పాలిట శాపంగా మారింది. దీంతో మాకు ఆధారం కావాలో అంటూ గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. గతంలో ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 4వేల వరకు కొత్త ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ జరిగితే ప్రస్తుతం అది వందల సంఖ్యకు పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్రధానమైన విషయంలో కీలక తరుణంలో రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఈ విషయమై ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.