ఏబీవీ వ్యవహారంపై సీఐడీతో విచారణ..? నిజనిజాలు వెలికితీసేందుకే, కేశినేనిపై సజ్జల ఫైర్
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సీఐడీకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వెంకటేశ్వరరావుపై ఏడు అభియోగాలు ఉన్నాయి. అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర దర్యాప్తుతో నిజ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఐబీ చీఫ్గా అక్రమాలు..?
అంతర్గత పరికరాల కొనుగోలు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అనుకొంటుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో జరిగిన పరికరాల కొనుగోలుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తే.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం ఏబీవీ మీడియాకు లేఖ కూడా రాశారు. బంధుమిత్రులను ఉద్దేశించి లేఖ పోస్ట్ చేశారు. తన సస్పెన్షన్ గురించి భయపడబోనని పేర్కొన్నారు. చట్టపరంగా పోరాడే అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
కేశినేని నాని ట్వీట్
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. వెంకటేశ్వరరావును సన్మానిస్తారని అనుకొంటే.. సస్పెండ్ చేశారేంటీ అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం అని ట్వీట్లో కేశినాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వెంకటేశ్వరరావు కీ రోల్ పోషించారని నాని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని సన్మానం చేయాల్సింది పోయి.. సస్పెండ్ చేయడం ఏంటి అని ట్వీట్లో కేశినేని నాని ప్రశ్నించారు.
సజ్జల రియాక్షన్
కేశినాని ట్వీట్పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గత ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు చేసిన అక్రమాలను కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీవీ ప్రజల రక్షణ కోసం కాక.. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేశారని ఆరోపించారు. వైసీపీని దెబ్బకొట్టేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించారని తెలిపారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికకు ఏబీవీపే కారణమని ఆరోపించారు. 23 మందితోపాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు.
ఇదీ కారణం
ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అనంతరం ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు.
కుమారుడి కంపెనీకి..
ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారంటూ విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది.