కిరణ్ రెడ్డి వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయన వెంట ఎంత మంది ఉంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన వెంట 40 నుంచి 50 మంది సీమాంధ్ర శాసనసభ్యులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తమ అభిమతాన్ని పలువురు శాసనసభ్యులు ముఖ్యమంత్రికి తెలియజేశారని కూడా అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం పదవి ఉన్నప్పుడే ఎవరైనా వెంట ఉంటారని, పార్టీని వీడితే అంత మంది రావడం కష్టమని కూడా అంటున్నారు.
ముఖ్యమంత్రి పదవికి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా చేస్తే మరి కొందరు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై సిఎం కిరణ్కుమార్రెడ్డితో ఆయన సన్నిహిత మంత్రులు కొందరు మంతనాలు సాగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని గంటా శ్రీనివాస రావు చెప్పారు. బిల్లు ఆమోదం పొందితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని టిజి వెంకటేష్ ఇప్పటికే అన్నారు.
పార్లమెంటులో టి బల్లు ప్రవేశపెట్టిన తరువాత రాజీనామాల పర్వం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ స్థితిలోనే సోమవారంనాడు రాష్ట్ర గవర్నర్ను ముఖ్యమంత్రి కలిశారన్న చర్చ కూడా సాగుతోంది. ఎప్పుడు రాజీ నామా చెయ్యాలనే విషయంపై కొందరు మంత్రులు ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
రాజీనామా లేఖను నేరుగా గవర్నర్కు అందజేయడమా లేదా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపడమా అనే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తను రాజీనామా చేస్తూ శాసనసభ రద్దుకు సిఫార్సు చేయాలా అనే విషయంపై ముఖ్యమంత్రి న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.