ACB Court ఆగ్రహం: జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి ధూళిపాళ్ల.. ఏ జరిగిందంటే..?
అమరావతి: టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు నిన్న నిర్వహించిన కరోనా టెస్టులో నెగిటివ్ రావడంతో ఏసీబీ పోలీసులు ఆయన్ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఏసీబీ కోర్టు అనుమతి లేకుండా ధూళిపాళ్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. తమ అనుమతి లేకుండా ఆస్పత్రి నుంచి జైలుకు తరలించే ప్రయత్నం చేయొద్దని కోర్టు పోలీసులకు గట్టిగా చెప్పింది. దీంతో పోలీసులు తిరిగి విజయవాడ ఆస్పత్రికి ధూళిపాళ్లను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ధూళిపాళ్లను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ధూళిపాళ్లను కస్టడీకి అప్పగించింది. ఇదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం బుధవారం మళ్లీ కరోనా టెస్టులు నిర్వహించగా ధూళిపాళ్లకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ పోలీసులు జైలుకు తరలించారు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను ఐసొలేషన్లో ఉంచాల్సిందిగా సూచించారు. దీంతో జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక గదిలో ఐసొలేషన్లో ఉంచుతామని చెప్పి పోలీసులు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ అనుమతి లేకుండా ధూళిపాళ్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను విజయవాడలోని ఆస్పత్రిలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే సంగండెయిరీలో సోదాలపై ఏసీబీ కోర్టులో వారెంట్ రీకాల్ పిటిషన్ దాఖలైంది . ఈ నెల 16లోగా తనిఖీలు ముగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హైకోర్టు సూచించిన ప్రాంగణంలోనే సోదాలు జరపాలని సూచించింది ఏసీబీ కోర్టు. మరోవైపు సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్తో పాటు మరికొంత మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కంపెనీకి సంబంధించి ల్యాప్టాప్ ఇతర డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు సంగం డెయిరీ బాధ్యతలను ప్రభుత్వానికి బదిలీ చేస్తూ జారీ అయిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.