చంద్రబాబు కేసులో హోరాహోరీ వాదనలు - తీర్పు రిజర్వ్, వాట్ నెక్స్ట్..!!
చంద్రబాబు రిమాండ్ పై సీఐడీ కోర్టులో సుదీర్ఘ వాదనలు హోరా హోరీగా జరిగాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సిద్దార్ధ లూద్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, సీఐడీ తరపున వివేకాచారి,వెంకటేష్ లు ఈ కేసులో వాదించారు. సాంకేతికల..చట్ట పరమైన అంశాల పైన చంద్రబాబు...సీఐడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయం తరువాతి పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును రోడ్డు మార్గంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో తాడేపల్లి లోని సీఐడీ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేసారు. మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసేందుకు అవకాశం కల్పించారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బాలయ్య సిట్ కార్యాలయంలో చంద్రబాబును కలిసారు. వారికి చంద్రబాబు అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. ఆ తరువాత ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలను సంధించిన అధికారులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. చంద్రబాబు సమాధానాలు ఇవ్వటంలో సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో, వ్యవహారం కోర్టుకు చేరింది.

కోర్టులో న్యాయమూర్తి తన ఛాంబర్ లో వాదనలు వినిపించాలని కోరినా..ఓపెన్ కోర్టులోనే వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో, ఓపెన్ కోర్టులోనే వాదనలు కొనసాగాయి. ఈ కేసులో కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలు ప్రస్తావించారు. చంద్రబాబు తన వాదనలు వినిపించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ విధానంలో అధికారుల తీరు పై న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసారు. చంద్రబాబు పై ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సీఐడీ తరపున వాదనలను కోర్టు ముందు ఉంచారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఈ స్కాం జరిగిందని వాదించారు.
సెక్షన్ 409 కేంద్రంగా ప్రధానంగా వాదోపవాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్, గవర్నర్ అనుమతి, కేసు ఎప్పుడో పూర్తయిందంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి భిన్నంగా ప్రభుత్వ న్యావాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదని.. అవినీతికి పాల్పడలేదని చెప్పటం లేదని..సాంకేతిక అంశాలనే ప్రస్తావిస్తున్నారని కోర్టుకు వివరించారు. అరెస్ట్ పైన స్పీకర్ కు సమాచారం ఇచ్చామని.. గవర్నర్ కు మూడు నెలల్లోగా అనుమతి తీసుకొనే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. నిధులు ఎక్కడకు మళ్లించారనే అంశం పై తెలుసుకొనేందుకు రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి వాదనల పైన తన తీర్పు వెల్లడించటానికి రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా తీర్పు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications