ఎసిబి విచారణ: 7 గంటలు 60 ప్రశ్నలు, ఏమీ తెలియదన్న రేవంత్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో పట్టుబడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై రెండో రోజు ఆదివారం ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 7 గంటల పాటు రేవంత్ రెడ్డిని విచారించారు. ఆయనకు 60 ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
రెండో రోజు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ హెడ్క్వార్టర్స్కు తరలించారు. డీఎస్పీ నేతృత్వంలో ముగ్గురు అధికారులు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో రేవంత్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రేవంత్ రెడ్డిని విచారించారు.
మొత్తం ఏడు గంటల్లో గంట పాటు మధ్యాహ్న భోజనం, ఇతర అవసరాల నిమిత్తం పోయింది. దీంతో ఆరు గంటల పాటు ఆయనను ఎసిబి అధికారులు ప్రశ్నలతో ముంచెత్తారు. ప్రశ్నావళిని ముందుగా సిద్ధం చేసుకుని ఎసిబి అధికారులు డబ్బులు ఎక్కడివి? ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇంకెవరినైనా ప్రలోభపెట్టారా? ఓటుకు నోటు డీల్లో ఎంతమంది పాల్గొన్నారు? మొదట ఎవరు ఎవర్ని కలుసుకున్నారు? డబ్బుల ప్రస్తావన ఎలా వచ్చింది? తదితర ప్రశ్నలకు రేవంత్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

వేర్వేరు గదుల్లో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విచారించాయి. విచారణ జరుగుతున్నంతసేపూ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రధాన కార్యాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు జారీ చేశారు.
రేవంత్ తదితరులను న్యాయవాదుల సమక్షంలో విచారించిన అధికారులు న్యాయవాదులు బయట మీడియాతో ఏం మాట్లాడుతున్నారు, తర్వాత ఎవరెవరితో టచ్లో ఉంటున్నారనే విషయాలపైనా దృష్టిసారించారు. వారు మీడియాతో మాట్లాడడానికి వచ్చిన సమయంలో పోలీసు సిబ్బంది వారి వెంటే ఉన్నారు. ముగ్గురి తరఫు న్యాయవాదులు కూడబలుక్కున్నట్లు ఒకే సమాచారం చెప్పడాన్నిబట్టి చూస్తే ఏసీబీ అధికారులు ముందుగానే వారికి తగి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రశ్నిస్తున్నందుకే తనను కుట్రపూరితంగా ట్రాప్ చేసి కేసులో ఇరికించారని రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బలంతోనే గెలవాలనుకున్నామని, ఇతరుల సహకారం గురించి ఆలోచించనే లేదని కస్టడీలో ఏసీబీ అధికారులకు చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో వెనక ఉన్నది ఎవరు? అని ఏసీబీ అధికారులు పదేపదే ప్రశ్నించడంతో తనకేమీ సంబంధం లేదని, కుట్రతో ఇరికించారని, తన వెనక ఇంకా ఎవరో ఎందుకుంటారని రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.
ఓటు విషయంలో మరెవరైనా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారా? అనే ప్రశ్నకు కాల్ డేటా పరిశీలిస్తే తెలుస్తుందని రేవంత్ బదులిచ్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు, మీకు మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? డబ్బు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నలు సంధించడంతో, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications