ప్లాన్ చేంజ్: కోర్టు ద్వారా బాబుకు నోటీసు, ఏమైనా సరే.. కేసీఆర్తో ఏపీ ఢీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం ద్వారా నోటీసులు జారీ చేయించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీలో ఉన్నాయి.
అవి ల్యాబ్లో ఉండటంతో.. తదుపరి అడుగు పైన తెలంగాణ ఏసీబీ యోచిస్తోంది. దర్యాఫ్తులో భాగంగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందని సమాచారం. టేపులపై ఫోరెన్సిక్ నివేదిక అనంతరం నోటీసులు జారీ చేయాలని తొలుత భావించారు.
కానీ, ఇప్పుడు ఏసీబీ మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నివేదిక అందేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో తాము సేకరించిన ఆధారాలతో కోర్టు ద్వారానే చంద్రబాబుకు నోటీసులు ఇప్పించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
మంగళవారం చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయ నిపుణులతో ఏసీబీడీజీ ఏకే ఖాన్ చర్చించారు.
అనంతరం కోర్టు ద్వారా జారీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షి స్టీఫెన్ సన్ బుధవారం మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు.ఈ వాంగ్మూలంతో కేసు మరిన్ని మరుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ సర్కార్ రె'ఢీ'
తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధపడింది. రాజ్యాంగ సంక్షోభం వచ్చినా ఢీకొనేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనేందుకు ఆధారాలు ఉన్నాయని, దాంతో తెలంగాణ ప్రభుత్వం కూల్చవచ్చునని ఏపీ మంత్రులు చెబుతున్న విషయం తెలిసిందే.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇస్తే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సిద్ధమవుతోంది. చంద్రబాబుపై తెలంగాణ సర్కారు కేసు నమోదు చేస్తే, ఏపీ సర్కారు కూడా అదే యోచనలో ఉంది.
ఇలాంటి కేసులు మనలను భయపెట్టలేవని, కేసీఆర్వి గల్లీ రాజకీయాలు అయితే, చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలు అని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కూడా ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.